వనపర్తి : రైతు బతికితేనే రాజ్యం బతుకుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
వనపర్తి నియోజకవర్గంలో 41 రైతు వేదికలలో ఏకకాలంలో రైతుల ఆత్మీయ సమ్మేళనాల నేపథ్యంలో గోపాల్ పేట, పొలికెపాడు తదితర రైతు వేదికలలో సమ్మేళనాలకు మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతుల పరిస్థితి 2014 తెలంగాణకు ముందు, 2014 తెలంగాణ తర్వాత బేరీజు వేసుకోవాలన్నారు.
రైతు రాజ్యంగా, రైతు రాష్ట్రంగా తెలంగాణ నిలవాలన్న సంకల్పంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో ఎవరూ ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, సాగునీరు, రైతుబంధు కింద పంట పెట్టుబడి, రైతు బీమా పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలుకావడం లేదన్నారు.
సంప్రదాయ పంటల సాగు నుంచి రైతులు బయటకు రావాలన్నారు. ఏ రకమైన పంటలు పండిస్తే మార్కెట్లో డిమాండ్ ఉంటుందో వాటినే పండించాలని సూచించారు. నిరంతరం పంటల సాగు, సాగు పద్ధతుల అంశాల మీద రైతువేదికలలో చర్చ జరగాలని పేర్కొన్నారు. ఆహార ధాన్యాల పంటలతో పాటు ఉద్యాన పంటల మీద ఇకపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
పండ్ల తోటలు, ఆయిల్ పామ్, నూనె గింజల సాగు మీద దృష్టిపెట్టాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, ఆదాయం వచ్చేలా చూసుకోవాలన్నారు. రైతులు ఆర్థికంగా స్థిరత్వం సాధించి బలపడితే ఆయన చుట్టూ ఉన్న సర్వ వ్యవస్థలు బలపడతాయన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో అధునాతన సాంకేతిక సహకారంతో రైతులకు విజ్ఞానం అందించేందుకు కృషి చేస్తామన్నారు. మార్కెటింగ్ నెట్ వర్క్ ను వ్యవసాయరంగానికి అనుసంధానం చేసేలా చర్యలు చేపడుతాం.
41 రైతు వేదికలలో రైతు ఆత్మీయ సమ్మేళనాల ద్వారా వచ్చిన సూచనలు, సలహాలు తీసుకుని ముందుకుసాగుతామని స్పష్టం చేశారు. త్వరలో 25 వేల మందితో వనపర్తిలో భారీ అన్నదాతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తాం. వ్యవసాయ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ అనుబంధ రంగాల నిపుణులను ఆహ్వానిస్తామని తెలిపారు.
రైతు ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలో ఇంకా చర్చ జరగాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
Khammam | బుల్లెట్పై తిరుగుతూ..చెక్కులు పంచుతూ
Warangal | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత
Yadadri Temple | యాదాద్రిలో లక్ష పుష్పార్చన