Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాగునీటి కోసం తెలంగాణ ప్రజలు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శివారు మున్సిపాలిటీలకు 15 రోజులకోసారి కూడా మంచినీళ్లు రాకపోయేవి. భూగర్భజలాలు లేక, నల్లా నీరు రాక కుత్బుల్లాపూర్ లాంటి ప్రాంతాల్లో జనం కలుషిత నీటినే తాగాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వరకు ఉన్న అన్ని ప్రాంతాలకూ రోజు విడిచి రోజు సమృద్ధిగా తాగునీరు అందుతున్నది.
ఇదంతా రాత్రికి రాత్రి జరిగిన మార్పు కాదు. కేసీఆర్ ప్రభుత్వం పట్టుదలతో నదీజలాలను తీసుకొచ్చి, విస్తృతమైన పైపులైన్ నెట్వర్క్ను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చింది. గతంలో పేరుకు మాత్రమే విశ్వనగరంగా ఉన్న హైదరాబాద్ను దేశంలోని ఏ ఇతర మెట్రో నగరానికీ తీసిపోని విధంగా తీర్చిదిద్దింది. అందుకోసం ప్రభుత్వ పూచీకత్తుతో హడ్కో నుంచి జలమండలికి రూ.1,900 కోట్ల రుణాన్ని ఇప్పించింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తాజాగా రేవంత్రెడ్డి ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలోని అప్పుల్లో ఇదీ ఒక భాగమే. అంతేకాకుండా జలమండలి ద్వారా చూపిన అప్పుల్లో దీనితోపాటు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు సైతం శ్వేతపత్రంలో ఉండటం గమనార్హం. అయినప్పటికీ ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులేనని, అవి తెలంగాణకు గుదిబండగా మారాయని ప్రజలను మభ్యపెట్టేందుకు రేవంత్ సర్కారు ప్రయత్నించింది. వాస్తవంగా చూస్తే జలమండలి ద్వారా చేసినది అప్పు కాదని, ప్రజలకు అందించిన సుజలమని స్పష్టమవుతున్నది.
కేసీఆర్ ప్రభుత్వ పూచీకత్తుతో జలమండలి రూ.5,164 కోట్ల అప్పు తీసుకున్నట్టు శ్వేతపత్రంలో పేర్కొన్న రేవంత్ సర్కారు.. ఇందులో ఈ నెల ఒకటో తేదీ నాటికి ఇంకా రూ.2,352 కోట్ల అప్పు ఉన్నట్టు చూపింది. కానీ, గత తొమ్మిదిన్నరేండ్లలో జలమండలి కేసీఆర్ ప్రభుత్వ పూచీకత్తుతో తీసుకున్న రుణం రూ.1,900 కోట్లు మాత్రమే. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ జలమండలిని పట్టించుకున్న దాఖలాలే లేవు. దీంతో ఆ సంస్థ ఏటా అప్పుల్లో కూరుకుపోయేది. కానీ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏటా జలమండలికి పుష్కలంగా బడ్జెట్ కేటాయింపులు జరిపింది. గత తొమ్మిదిన్నరేండ్లలో జలమండలి దాదాపు రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ అందులో రుణంగా తీసుకున్నది రూ.1900 కోట్లే. మిగిలిన మొత్తాన్ని కేసీఆర్ ప్రభుత్వమే బడ్జెట్ కేటాయింపుల ద్వారా సమకూర్చింది. దీనితోపాటు గత మూడేండ్ల నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు నెలకు 20 వేల లీటర్ల చొప్పున ఉచితంగా మంచినీరు సరఫరా చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఏటా రూ.300 కోట్ల చొప్పున జలమండలికి అందించింది.
తెలంగాణ ఏర్పడేనాటికి కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి తదితర శివారు ప్రాంతాల్లో 15 రోజులకోసారి కూడా తాగునీరు వచ్చేది కాదు. నగరం చుట్టూ ఉన్న 12 శివారు మున్సిపాలిటీలను 2009లోనే గ్రేటర్లో కలిపినప్పటికీ కనీసం మంచినీటి సదుపాయం కూడా కల్పించలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హడ్కో ద్వారా రూ.1,900 కోట్ల రుణాన్ని తీసుకొని కృష్ణా, గోదావరి నుంచి వచ్చే జలాలను శివారు ప్రాంత ప్రజలకు అందించింది. ఇందుకోసం 12 మున్సిపాలిటీల పరిధిలో 56 రిజర్వాయర్లను నిర్మించారు. 1,800 కిలోమీటర్ల పైపులైన్ను ఏర్పాటు చేశారు. తద్వారా 40 లక్షల మందికి తాగునీటిని అందించారు.
శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపిన రూ.5,164 కోట్లలో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన రూ.1,900 కోట్లను మినహాయిస్తే మిగిలి రూ.3,264 కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలే. కృష్ణా, గోదావరి నదుల నుంచి హైదరాబాద్కు తాగునీటిని అందించేందుకు చేపట్టిన పనుల కోసం అప్పటి ప్రభుత్వ పూచీకత్తుతో జలమండలి ఈ రుణాలను తీసుకున్నది. వీటికి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జలమండలి రూ.912 కోట్లను వాయిదాల రూపంలో చెల్లించింది.