Crop Holiday | హైదరాబాద్, డిసెంబర్14 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది యాసంగి సీజన్లో నాగార్జునసాగర్ ఆయకట్టుకు చుక్కనీరు కూడా ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ తేల్చేసింది. దీంతో సాగర్ ఆయకట్టుకు క్రాప్హాలిడే తప్పదని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించాలని నిర్ణయించింది. ఇది గత యాసంగిలో నిర్దేశించిన లక్ష్యం 33.46 లక్షల ఎకరాల కంటే తక్కువ.
ఈ మేరకు సాగునీటి పారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ఏడాది కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడం, ఎగువ నుంచి వరదలు రాకపోవడంతో నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ మట్టం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 157.61 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయి. అందులో 105.70 టీఎంసీలను తెలంగాణ వాటాగా కేటాయించారు. వీటిని తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఆశించిన స్థాయిలో నీటినిల్వలు లేకపోవడంతో సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు యాసంగి సీజన్లో సాగునీరు ఇవ్వలేమని అధికార యంత్రాంగం తేల్చింది. ఎడమ కాలువ కింద మొత్తంగా 6.40 లక్షల ఎకరాలు ఉండగా, ఈ యాసంగిలో ఒక్క ఎకరాకు కూడా నీరు ఇచ్చే పరిస్థితి లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో 57 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు యాసంగి సీజన్లో సాగునీరివ్వలేని పరిస్థితి నెలకొన్నది. నెట్టెంపాడు కింద 5 వేల ఎకరాలకు, మూసీ ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరివ్వాలని అధికారులు ప్రతిపాదించారు.
కృష్ణా బేసిన్ వెలవెలబోతున్నప్పటికీ, గోదావరి బేసిన్లోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతుండటం కాస్తంత ఊరట. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల్లోని ప్రస్తుత నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఏ ప్రాజెక్టు కింద ఎన్ని లక్షల ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించాలనే దానిపై రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐఈఏఎం) తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
సదరు ప్రతిపాదనలపై టెరిటోరియల్ వారీగా చీఫ్ ఇంజినీర్లతో ఈఎన్సీ మురళీధర్ బుధవారం చర్చించారు. ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలను పరిగణనలోకి తీసుకుని యాసంగిలో ఎంత ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యమో లెక్కతేల్చారు. 2023-24 యాసంగిలో మొత్తంగా 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని ఇవ్వాలని నిర్ణయించారు.
ఎస్సారెస్పీ-1,2 కింద 11.55 లక్షల ఎకరాలకు..
యాసంగి సీజన్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద దాదాపు 11.55 లక్షల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని సాగునీటి పారుదలశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 78.66 టీఎంసీల నీరు మా త్రమే అందుబాటులో ఉన్నది. ఇందులో 6.50 టీఎంసీలు తాగునీటి అవసరాలకు, మిగతా నీటిని సాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు.
ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ స్టేజ్-1 కిం ద మొత్తంగా 9,65,013 ఎకరాలు ఉండగా, అందులో 8,28,297 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో 3.87 లక్షల ఎకరాలకు ఆరుతడి పంటలకు, 4.41 లక్షల ఎకరాలకు తరి పంటలకు సాగునీ రు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇదిలా ఉండగా గత యాసంగి సీజన్లో స్టేజ్-1 కింద ఉన్న మొ త్తం 9,68,640 ఆయకట్టుకు 9,60,000 ఎకరాలకు సాగునీరు అందించారు.
8 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు
యాసంగి సీజన్ పంటల సాగు జోరుగా సాగుతున్నది. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం.. బుధవారం వర కు రాష్ట్రవ్యాప్తంగా 7.97 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గత సీజన్లో ఇదే సమయానికి 7.69 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతంతో పోల్చితే ఈ సీజన్లో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నది. గతంలో ఈ సమయానికి 12 వేల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడగా ఈ సీజన్లో ఇప్పటికే 76 వేల ఎకరాలకు పైగా వరి సాగైంది. మక్కజొన్న కూడా ఎక్కువగానే సాగవుతున్నది. నిరుడు ఇదే సమయానికి 1.64 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగు కాగా ప్రస్తుతం 2.02 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 54.93 లక్షల ఎకరాలు ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా.
నీటి విడుదలకు సన్నాహాలు
రాష్ట్రంలో యాసంగి పంటల సాగుకు నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ సన్నద్ధమవుతున్నది. ఆ శాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లభించగానే ప్రాజెక్టులవారీగా నీటి విడుదల తేదీలను ఖరారు చేయనున్నారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో 8 రోజులు ఆన్, 7 రోజులు ఆఫ్ నీటిని విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు.
ప్రాజెక్టుల వారీగా ప్రతిపాదిత యాసంగి సాగు విస్తీర్ణం ఎకరాల్లో..
ప్రాజెక్టు : ప్రతిపాదిత సాగు విస్తీర్ణం
భారీ ప్రాజెక్టులు : 18,68,883
మధ్యతరహా ప్రాజెక్టులు : 2,18,535
మైనర్ ప్రాజెక్టులు : 6,72,938
ఐడీసీ : 1,35,223
మొత్తం : 28,95,579
వివిధ మేజర్ ప్రాజెక్టుల కింద ఈ ఏడాది సాగునీటిశాఖ ప్రతిపాదనలు..
ప్రాజెక్టు : ప్రతిపాదిత సాగు విస్తీర్ణం
ఎస్సారెస్పీ స్టేజీ 1 : 8,28,297
ఎస్సారెస్పీ స్టేజీ 2 : 3,26,914
కాళేశ్వరం : 93,070
మధ్యమానేరు : 54,224
కడెం : 0
అలీసాగర్ : 48,282
గుత్ప : 33,725
నిజాంసాగర్ : 1,24,825
జూరాల : 23,346
ఆర్డీఎస్ : 0
నాగార్జునసాగర్ : 0
మూసి : 30,000
సింగూరు : 40,000
దేవాదుల : 2,02,400
నెట్టెంపాడు : 5,000
కల్వకుర్తి : 0
ఏఎమ్మార్పీ, ఎస్ఎల్బీసీ : 0