Telangana | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పారిశ్రామిక రంగం గత ఐదు నెలల నుంచి పూర్తిగా పడకేసింది. అసెం బ్లీ ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి కొత్త పరిశ్రమలకు అనుమతులు, భూముల కేటాయింపులు నిలిచిపోయాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం నూత న పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదురుచూస్తున్నారు. తాజాగా, పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో నూతన పారిశ్రామిక విధానం మరో రెండు మూడు నెలల వరకు రాకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర విభజనకు ముందు పెట్టుబడుల విషయంలో తీవ్ర వివక్షకు గురైన తెలంగాణ.. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక అన్ని రంగాల్లో పరుగులు తీసింది. పారిశ్రామిక రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానానికి చేర్చాలన్న సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం టీఎస్-ఐపాస్ పేరుతో నూతన చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీంతో గత పదేండ్లలో రాష్ర్టానికి దాదాపు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షలకుపైగా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించాయి. అనంతరం సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు నూతన విధానాన్ని ప్రవేశపెడతామని ప్రకటించింది. కానీ, ఇంతవరకు ఆ పాలసీని ప్రవేశపెట్టకపోగా, గతంలో యూనిట్లు ఏర్పా టు చేసుకున్నవారికి సైతం రాయితీలను విడుదల చేయడంలేదు. దీంతో దాదాపు రూ.3,500 కోట్ల మేరకు సబ్సిడీ బకాయిలు పేరుకుపోయాయి.
కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేవారికి కేంద్ర ప్రభుత్వం సైతం వివిధ పథకాల కింద రాయితీలు అందిస్తున్నది. ఆహారశుద్ధి, ఔషధాలు, వస్ర్తాలు, లెదర్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు విరివిగా ప్రోత్సాహకాలను అందజేయడంతోపాటు క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద నూతన పారిశ్రామికవాడల ఏర్పాటునకు చేయుతనిస్తున్నది. అయితే, కేంద్రం అమలుచేసే పథకాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నది. పరిశ్రమలకు కేంద్రం అందించే రాయితీలను రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా పంపిణీ చేయాల్సి ఉన్నది. కానీ, గత కొన్ని నెలల నుంచి రాష్ట్రంలో కొత్త పరిశ్రమలకు అనుమతులు నిలిచిపోవడంతో కేంద్ర పథకాలు సైతం అందడం లేదు. దీంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అయోమయం లో కొట్టుమిట్టాడుతున్నారు.
సాధారణంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణాలు లేకుండా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఎవరూ ముందుకురారు. పరిశ్రమల శాఖ అనుమతులు ఉన్న యూనిట్లకే బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. టీఎస్-ఐపాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పారిశ్రామికవేత్తలకు అర్హతలను బట్టి రాయితీ ధరతో భూములను కేటాయిస్తారు. ఇలా భూములు పొందినవారికే సులభంగా రుణాలు ఇస్తారు. ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలను పొందేందుకు కూడా అనుమతులు తప్పనిసరి. కానీ, రాష్ట్రంలో గత ఐదు నెలల నుంచి కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇవ్వకపోవడం, భూకేటాయింపులను నిలిపివేయడంతో దరఖాస్తుదారులకు ఎదుచూపులు తప్పడంలేదు.
రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు నూతన పారిశ్రామిక విధానం వచ్చేవరకు వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొన్నది. రాయితీలపై ప్రభుత్వం కొత్త పాలసీని తీసురావాలన్న యోచనలో ఉన్నదని, ఎంపీ ఎన్నికలు పూర్తయ్యాక ఈ విధానాన్ని ప్రకటించే అవకాశమున్నదని అధికారులు చెప్తున్నారు. నూతన పారిశ్రామిక విధానానికి సంబంధించిన ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందని, దీన్ని ప్రభుత్వం ఆమోదించాల్సి ఉన్నదని చెబుతున్నారు.