హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ సన్నద్ధతపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రెండు రోజులపాటు మాక్డ్రిల్ నిర్వహించనున్నది. సోమ, మంగళవారాల్లో గాంధీ దవాఖానతోపాటు కొవిడ్ చికిత్సకు అనుమతి పొందిన అన్ని ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటళ్లలో డ్రిల్ జరుగనున్నది.
చివరగా రాష్ట్రంలో నిరుడు డిసెంబర్ 27న మాక్డ్రిల్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం రోజువారీ కేసులు 5 వేలకుపైగా నమోదు కాగా, పాజిటివిటీ 3.3% గా ఉన్నది. ఈ నేపథ్యంలో దవాఖానల సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ నిర్వహించాలని ఇటీవల కేంద్రం సూచించింది.