హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయం, ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ ఆదాయ పన్నుశాఖ అధికారులు మూడోరోజూ సోదాలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి జరిగిన సోదాల్లో పలు కీలకమైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం కోసం విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పెద్దమొత్తంలో డబ్బులు సేకరించడం, వందల కోట్ల జీఎస్టీ చెల్లింపులు చేయకపోవడం వంటి ఆరోపణలపై ఈ సోదాలు జరిగినట్టు సమాచారం. జూబ్లీహిల్స్లోని కార్పొరేట్ ఆఫీస్తోపాటు సుకుమార్ ఇల్లు, నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, ఎర్నేని నవీన్ నివాసాల్లోనూ ఐటీ బృందాలు తనిఖీలు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.