హన్వాడ/మహబూబ్నగర్, అక్టోబర్ 7: దివ్యాంగుడిపై సర్పంచ్ దాడి చేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం పుల్పోనిపల్లిలో చోటుచేసుకున్నది. ఉపాధి హామీ కూలిడబ్బులు సక్రమంగా రావట్లేదని, ఎక్కడ జాప్యం జరుగుతుందో తెలియజేయాలని పుల్పోనిపల్లికి చెందిన దివ్యాంగుడు కృష్ణయ్య ఇటీవల మండల అధికారులకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ శ్రీనివాసులు గురువారం సాయంత్రం కృష్ణయ్య ఇంటికెళ్లి అధికారులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని అడిగాడు.
ఈ క్రమంలో కృష్ణయ్యపై సర్పంచ్ దాడి చేశాడు. అయితే దివ్యాంగుడిపై దాడికి పాల్పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఎస్పీ స్పందించారు. వెంటనే సర్పంచ్పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని స్థానిక ఎస్సై రవినాయక్ను ఆదేశించారు. ఈ మేరకు సర్పంచ్పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఎస్సై తెలిపారు. అలాగే సర్పంచ్ను విధుల నుంచి శ్రీనివాసులును సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ వెంకట్రావు వెల్లడించారు. కాగా, దివ్యాంగుడిపై దాడికి పాల్పడిన సర్పంచ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దివ్యాంగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు.