మూసాపేట (అడ్డాకుల), ఫిబ్రవరి 16 : అర్ధరాత్రి వేళ వీధి కుక్కలపై కాల్పుల ఘటన మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో కలకలం రేపింది. ఈ ఘటనలో 20 కుక్కలు మృత్యువాత పడ్డాయి. అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో పొన్నకల్ గ్రామానికి ఓ కారులో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో వచ్చారు. ముందుగా మసీద్ వద్ద ఉన్న కుక్కపై కాల్పులు జరిపారు. తర్వాత వీధుల్లో తిరుగుతూ శునకాలపై కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఆ సమయంలో స్థానిక ఆలయంలో నిద్రిస్తున్న శివమాలధారులు రాజు, ఆంజనేయులు మేల్కొని గుర్తుతెలియని వ్యక్తులను చూసి భయపడ్డారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేకపోయారు. పొద్దున లేచి చూసే సరికి 20 కుక్కలు మృత్యువాతపడగా, మరో ఐదు గాయపడినట్టు స్థానికులు తెలిపారు.
వారి వద్ద లేజర్ లైట్స్తో కూడిన తుపాకులు ఉన్నట్టు గుర్తించానని రిటైర్డ్ ఆర్మీ జవాన్ రాజవర్ధన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ రామకృష్ణ గ్రామానికి చేరుకొని క్లూస్ టీం ద్వారా ఆనవాళ్లను, రెండు బుల్లెట్ కోక్స్ను సేకరించారు. అనుమానంతో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రాజవర్ధన్రెడ్డి వద్ద ఉన్న తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.