శక్కర్నగర్, మార్చి 4: పరీక్షలున్నాయి.. శ్రద్ధగా చదువుకోండని చెప్పడం ఆ విద్యార్థి పాలిట శాపమైంది. అతడిపై కోపం పెంచుకున్న సహచర విద్యార్థులు అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఊపిరాడక అతడు దుర్మరణం చెందాడు. ఈ దారుణమైన ఘటన ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లా బోధన్లోని బీసీ బాలుర కళాశాల వసతిగృహంలో చోటుచేసుకున్నది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారం తండాకు చెందిన హరియాలి వెంకట్ (23) బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ ఫైనలియర్ చదువుతున్నాడు. స్థానిక బీసీ బాలుర హాస్టల్లో ఉంటున్నాడు. ఈ హాస్టల్లో డిగ్రీతోపాటు ఇంటర్ విద్యార్థులు సైతం వసతి పొందుతున్నారు. హాస్టల్లోని విద్యార్థులకు లీడర్గా వ్యవహరించే వెంకట్.. సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులను పర్యవేక్షించే వాడు. పరీక్షలు కొనసాగుతుండటంతో సహచరులను బాగా చదువుకోవాలని ఒత్తిడి చేసేవాడు. దీంతో అతడిపై కోపం పెంచుకున్న ఏడుగురు విద్యార్థులు.. ఆదివారం అర్ధరాత్రి సమయంలో వెంకట్ నిద్రిస్తున్న గదికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఊపిరాడక వెంకట్ మృతి చెందాడు. దీంతో నిందితులు పారిపోయే క్రమంలో.. పక్కనే ఉన్న విద్యార్థులు నిద్రలేచారు. వారు వచ్చి చూసే సరికి వెంకట్ అపస్మారక స్థితిలో పడిఉన్నాడు. వెంటనే నిందితులను పట్టుకున్నారు.
సమాచారం అందుకున్న హాస్టల్ సంక్షేమ అధికారి స్వామి వచ్చి వెంకట్ను దవాఖానాకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధ్దారించారు. వెంకట్పై ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు పరమేశ్, నిఖిల్, శివ, ఇంటర్ సెకండియర్ చదువుతున్న దిలీప్, కృష్ణ, లక్ష్మణ్తోపాటు మరో మైనర్ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. తోటి విద్యార్థులు వెంకట్ తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో వారు వచ్చి ఆందోళనకు దిగారు. పరిస్థితిని గమనించిన పోలీసులు అదనపు బలగాలను రప్పించి బందోబస్తు ఏర్పాటు చేశారు. పథకం ప్రకారమే తమ కుమారుడిని హతమార్చారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంకట్ తండ్రి జగ్గు ఫిర్యాదు చేశారు. న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. హాస్టల్ విద్యార్థి మృతి ఘటనలో సంక్షేమ అధికారి స్వామిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వాచ్మన్ గంగాధర్ను కూడా విధుల నుంచి తొలగించారు.