మహబూబ్ నగర్ : జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో (Jadcharla Hospital ) జరిగిన సంఘటన దారుణమని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ( Laxma Reddy ) అన్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా మార్చురీ గదిలో మృతదేహాన్ని( Dead body ) కుక్క పీక్కుతినడం వైద్య అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు.ఆసుపత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు.
జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ,వంద పడకల ఆసుపత్రిని,నూతనంగా నిర్మించిన మార్చురీ బిల్డింగును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చురీ గదిలో ఫ్రీజర్లు లేవని, మృతదేహాలను స్ట్రెచర్ పై కాకుండా నేలపై పెట్టడం దురదృష్టకరమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోవడం లేదని వెల్లడించారు. కనీస సౌకర్యాలు కల్పించక హాస్పిటళ్లు దీనావస్థకు చేరుకుంటున్నాయని వివరించారు. వసతులు లేవు. మందులు లేవని దుయ్యబట్టారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హాస్పిటళ్లను అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని, కొత్త హాస్పిటల్స్ నిర్మించాం.పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించామని వెల్లడించారు. పాత రోజులు తెస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిజం చేసిందన్నారు.కొత్త హాస్పిటల్లో 2024 జూన్ లోనే మార్చురీ బిల్డింగ్ కంప్లీట్ అయినా వాడుకోలేదని పేర్కొన్నారు.
మార్చురీని ఎందుకు మార్చలేదని, పాత దాంట్లో ఫ్రీజర్,స్ట్రెచర్ ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలన గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని, జడ్చర్లలో స్థలాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం సొంత జిల్లా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇన్ఛార్జ్ గా ఉన్న జిల్లాలో ఇంతటి దుస్థితి నెలకొనడం సిగ్గుచేటని ఆరోపించారు. ప్రజలు సమస్యను వివరిస్తే వారిపైనే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.