హైదరాబాద్, మార్చి23 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో ఉద్యోగులు, అధికారులకు ఇప్పటివరకు అమలు చేస్తున్న ఇన్సెంటివ్ను రద్దు చేశారు. ఈ మేరకు బోర్డు చైర్మన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రివర్ బోర్డులో పనిచేసే సిబ్బందికి బేసిక్ వేతనాలపై అదనంగా 25 శాతం ఇన్సెంటివ్ను ఇవ్వాలని గతంలో బోర్డు నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో 2020 నవంబర్ నుంచి సిబ్బందికి ఇన్సెంటివ్ను చెల్లిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల ఆ ఇన్సెంటివ్ను రద్దు చేయడంతోపాటు, ఇప్పటివరకు చెల్లించిన మొత్తాన్ని కూడా రికవరీ చేయాలని కేఆర్ఎంబీకి కేంద్ర జల్శక్తిశాఖ సూచించింది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా బోర్డు చైర్మన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా దీనిపై బోర్డులో డిప్యుటేషన్పై విధులు నిర్వర్తిస్తున్న వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.