TS Weather | నిన్నమొన్నటి వరకు తెలంగాణపై దోబూచులాడిన మేఘాలు వర్షాలు కురిపించి వేసవి ఉక్కపోతను దూరం చేశాయి. భానుడి బాధ తప్పిందని ప్రజలు కాస్తంత ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ వచ్చేశాడు. ఈసారి చండ్రనిప్పులు కురిపిస్తున్నాడు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, వచ్చే మూడు రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మరో మూడు రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది. మంగళవారం నుంచి హైదరాబాద్ దాని చుట్టపక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీలు వరకు నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో వాతావరం పొడిగా ఉండే అవకాశం ఉంద ని తెలిపింది.దిగువ స్థాయిలోని గాలులు వాయవ్య దిశ నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని అధికారులు వివరించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం హడలిపోతున్నారు. ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. మూగజీవాలు ఎండవేడిని తట్టుకోలేక అల్లాడుతున్నాయి. మధ్యాహ్న వేళలో జనం ఇండ్లకే పరిమితం అవుతుండటంతో రోజువారీ వ్యాపారాలు కుదేలవుతున్నాయి.
వాయవ్య దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలుల ప్రభావంతో ..పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మంచిర్యాల, నిజామాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నల్లగొండ జిల్లాల్లో 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం మంచిర్యాల జిల్లాలోని కొండాపూర్లో 45.8, జన్నారంలో 45.8, బెల్లంపల్లిలో 45.4, నీల్వాయిలో 45.5, కొమ్మెర 44, జగిత్యాల జిల్లాలోని జైనాలో 45.5, కుమ్రంభీం జిల్లా కెరమెరిలో 45.4, నిజామాబాద్ జిల్లా ముప్కాల్లో 45.1, నల్లగొండ జిల్లా పజ్జూరులో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హసన్పర్తి/లక్షెట్టిపేట, మే 15: పెరిగిన ఎండల తీవ్రతకు ఉపాధి హామీ కూలీలు వడదెబ్బ తగిలి ఇపిట్టల్లా రాలిపోతున్నారు. ఇటీవలకాలంలో పదుల సంఖ్యలో కూలీలు మృతి చెందారు. సోమవారం హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సిద్ధాపూర్లో ముస్కు పెంటు(52) అనే ఉపాధి కూలీ సోమవారం వడదెబ్బతో కిందపడిపోయాడు. వెంటనే మిగతా కూలీలు ఎంజీఎం దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు ప్రకటించారు. కాగా, మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ముత్తె సంతోష్ (45) ఆదివారం వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై రాత్రి 10.30 గంటల ప్రాంతంలో మృతి చెందాడు.