TS Weather Updates | హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి బలహీనపడి నైరుతి దిశ నుంచి తెలంగాణ వైపునకు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.
రాబోయే మూడు రోజులు గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల వరకు నమోదవుతాయని పేర్కొన్నది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఉదయం 7 గంటల నుంచే వేడి గాలులు మొదలయ్యాయి. ఎండ, వేడి గాలుల తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్ర, శనివారాల్లో ఎండల తీవ్రత పెరగనున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.