యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట(Yadagiri Gutta) లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం 30 రోజుల హుండీ ఆదాయం(Hundi income) రూ.2,55,83,999 కోట్లు సమకూరిందని ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు. యాదాద్రి కొండకింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో గురువారం హుండీలను లెక్కించారు. ఈ లెక్కింపులో 91 గ్రాముల మిశ్రమ బంగారం, 4 కిలోల 650 గ్రాముల మిశ్రమ వెండి సమకూరిందని ఆమె వెల్లడించారు. దీంతోపాటు విదేశీ కరెన్సీ (Foreign currency) కూడా భారీగా వచ్చిందని వివరించారు.
స్వామివారికి గురువారం నిత్య పూజలు స్వయంభూ నారసింహుడి నిజాభిషేకం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవను నిర్వహించి తిరువారాధన, బాలబోగం చేపట్టారు. అనంతరం పాలు పెరుగు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో నిజాభిషేకం జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, కల్యాణోత్సవం సేవ, నిత్య తిరుకల్యాణోత్సవం, సువర్ణ పుష్పార్చనలు వైభవంగా జరిగాయి .
సాయంత్రం స్వామి వారిని గరుఢవాహనం, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై తిరువీధి సేవను కొనసాగించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులకు దర్బార్ సేవను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం స్వామివారిని 8 వేల మంది భక్తులు దర్శించుకున్నారని, స్వామివారికి నిత్యరాబడి రూ. 12,57,764 లక్షలు వచ్చిందని ఈవో పేర్కొన్నారు.