హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది అనుచితంగా ప్రవర్తించి న్యాయమూర్తికి నోటీస్ ఇవ్వడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. పర్యాటక శాఖకు చెందిన కేసులో విచారణ సందర్భంగా జస్టిస్ మాధవీదేవి ఎదుట విచారణ సమయంలో న్యాయవాది బాలముకుందరావు వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా కోర్టు హాలు నుంచి బయటికి వెళ్లిపోయారు. దీనిని సుమోటోగా తీసుకొన్న హైకోర్టు.. కోర్టు ధికరణగా పరిగణనలోకి తీసుకొని శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై బేషరతుగా క్షమాపణ చెప్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. నోటీసును ఉపసంహరించుకొని, చేసింది తప్పని అఫిడవిట్ దాఖలు చేయకపోగా దానిని సమర్థించుకొనేందుకు న్యాయవాది ప్రయత్నించడంపై మండిపడింది.
న్యాయమూర్తికి నోటీస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి అవుతుందని, ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని అన్నది. న్యాయవాదిలో పశ్చాత్తాపం లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మందలించింది. న్యాయవాద వృత్తి నుంచి బహిషరించడంతోపాటు కోర్టు ధికరణ కింద జైలుకు పంపుతామని హెచ్చరించింది. 40 ఏండ్ల సీనియారిటీ ఉన్న న్యాయవాదిగా మీరు ఈ వృత్తిలోకి వచ్చే యువ న్యాయవాదులకు ఏం సందేశం ఇస్తున్నారు? అని ప్రశ్నించింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ జోక్యం చేసుకొని గతంలోనూ సదరు న్యాయవాది ఇదే తరహాలో ప్రవర్తించారని, అప్పుడు కోర్టు ధికరణ కేసు దాఖలైనట్టు చెప్పారు. మధ్యలో న్యాయవాది వివరణ ఇవ్వబోగా, హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. చేసిన తప్పును సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయవద్దని సూచించింది. బేషరతుగా క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయని పక్షంలో కోర్టు ధికరణ కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.