హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లో సీనియారిటీ లెక్కింపుపై జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. తెలంగాణ విద్యుత్తు సంస్థలు జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో 2009 నుంచి నేరుగా నియమించిన ఉద్యోగుల సీనియారిటీని మెరిట్ ప్రాతిపదికన నిర్ధారించాలని 2001లో ట్రాన్స్కో జీవో 954 జారీ చేసింది. ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని విద్యుత్తు సంస్థల్లోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ గత ఏడాది నవంబర్ 29న విచారించి విద్యుత్తు సంస్థల్లోని జీవో 954, 62, 101, 37లపై స్టేటస్కో విధిస్తూ, ఉత్తర్వులను జారీ చేసింది. అయితే, ఆ ఉత్తర్వుల వల్ల విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న బీసీ, ఓసీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని, బీసీ, ఓసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి సంయుక్తంగా హైకోర్టులో జాతీయ ఎస్సీ కమిషన్ ఉత్తర్వులను సవాల్ చేశారు.
పిటిషనర్ తరఫున అడ్వొకేట్ సుంకర చంద్రయ్య వాదనలతో ఏకీభవించిన హైకోర్టు విచారణ అనంతరం జాతీయ ఎస్సీ కమిషన్ జారీచేసిన ఉత్వర్వులను నిలిపివేసింది. గతంలో సుప్రీంకోర్టు చెప్పినట్టు ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల సర్వీసు అంశాలపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారించి ఉత్తర్వులు జారీచేసే అధికారం లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు 2014 నుంచి కల్పించిన ప్రమోషన్లను సమీక్షించి నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించాల్సి ఉన్నది. 2009 తర్వాత నియమితులైన ఉద్యోగుల సీనియారిటీని వెంటనే మెరిట్ ప్రాతిపదికన ప్రకటించాలని తెలంగాణ విద్యుత్తు బీసీ, ఓసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేస్తున్నది.