హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఒక వ్యక్తి వేరే కుటుంబానికి దత్తత వెళ్తే.. పుట్టిన కుటుంబ ఆస్తులపై ఆ వ్యక్తికి హక్కులు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది. దత్తత వెళ్లిన కుటుంబంలో మాత్రమే ఆ వ్యక్తికి హకులు ఉంటాయని పేర్కొన్నది. తాను దత్తత వెళ్లినప్పటికీ జన్మించిన కుటుంబ ఆస్తిలోనూ తనకు వాటా వస్తుందని ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలానికి చెందిన ఏవీఎల్ఆర్ నర్సింహారావు చేసిన వాదనను కింది కోర్టు సమర్థించడంతో ఆయన సోదరుడు ఏ నాగేశ్వరరావు హైకోర్టులో సవాల్ చేశారు.
ఈ అప్పీల్ను ఆమోదిస్తూ జస్టిస్ పీ నవీన్రావు, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి, జస్టిస్ నగేశ్ భీమపాకతో కూడిన విస్తృత ధర్మాసనం (ఫుల్ బెంచ్) 44 పేజీల చారిత్రక తీర్పును వెలువరించింది. ఒక వ్యక్తి రెండు కుటుంబాల్లో సభ్యుడిగా ఉండేందుకు వీల్లేదని, మైనేస్ హిందూ చట్టం లేదా ముల్లా సూత్రాలపై ఆధారపడిన హిందూ చట్టాల ప్రకారం దత్తత చేసినట్టయితే జన్మించిన కుటుంబంతో సంబంధాలన్నీ తెగిపోతాయని ఆ తీర్పులో పేర్కొన్నది. దత్తత చట్టంలోని సెక్షన్ 12(బీ) ప్రకారం.. దత్తత వెళ్లినవారికి ముందే ఆస్తులున్నా, లేక అప్పటికే జన్మించిన కుటుంబంవారు ఆస్తులు రాసిచ్చినా వాటిపై ఆ వ్యక్తులకు (దత్తత వెళ్లినవారికి) హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది.