Dimple Hayathi | హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారనే అభియోగాలను ఎదురొంటున్న సినీ నటి డింపుల్ హయతి, న్యాయవాది విక్టర్ డేవిడ్ పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు వారిద్దరికీ సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులు జారీ చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. గత నెల 17న జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ వారిద్దరూ దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం జస్టిస్ జీ అనుపమా చక్రవర్తి విచారణ చేపట్టారు.
పిటిషనర్లపై అసత్య అభియోగాలు నమోదు చేశారని, పోలీసులు అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ట్రాఫిక్ డీసీపీ ప్రోద్బలంతోనే ఆయన కారు డ్రైవర్ చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. ఏపీపీ గణేశ్ వాదిస్తూ, నటి డిపుల్ హయతికి పోలీసులు 41ఎ నోటీసులు జారీ చేశారని చెప్పారు. కారును ధ్వంసం చేసినట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. వాదనల అనంతరం న్యాయమూర్తి పైఆదేశాలు జారీ చేశారు.