హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక వేడి రోజురోజుకూ పెరుగుతున్నది. ఎన్నికలకు రెండుమూడు నెలల ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించటంతో ఎన్నికల కోలాహలం ఊపందుకొన్నది. టికెట్లు ఖరారైన అభ్యర్థుల్లో దాదాపు 90 శాతానికిపైగా ప్రస్తుతం ప్రజాప్రతినిధులే కావటంతో సీఎం ప్రకటన వచ్చిన వెంటనే రంగంలోకి దూకారు. తమతమ నియోజకవర్గాల్లో ఊరూరూ.. ఇల్లిల్లూ తిరుగుతూ మరోసారి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, సమస్యలు తెలుసుకొంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో ప్రతి గ్రామంలో గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. ఇదే సమయంలో విపక్ష కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాలు యుద్ధభూమిగా మారుతున్నాయి. టికెట్లు ఆశిస్తున్న నేతలు ఆఫీసుల వద్దే పోటాపోటీగా బలయప్రయోగానికి దిగుతుండటంతో రణరంగాన్ని తలపిస్తున్నాయి. దీంతో విపక్షాల పరిస్థితి మూడు గ్రూపులు, ఆరు శిబిరాలుగా మారింది.
బీఆర్ఎస్కు ఘన స్వాగతం
నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తున్నది. స్థానిక నాయకులు, కార్యకర్తలు ‘కలిసి పనిచేద్దాం..విపక్షాలను నిలువరిద్దాం’ అని ఒక్కతాటిపైకి వస్తున్నారు. కేసీఆర్ను మూడోసారి సీఎంను చేయటమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 105 మంది అభ్యర్థులను ఏకకాలంలో ప్రకటించగా, ఈసారి ఏకంగా 115 మందిని ప్రకటించి విపక్షాల వెన్నులో సీఎం కేసీఆర్ వణుకు పుట్టించారు. ఈ షాక్ నుంచి కాంగ్రెస్, బీజేపీ ఇంకా తేరుకోలేకపోతున్నాయి.
ఉత్సాహం నింపుతున్న చేరికలు
ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం బీఆర్ఎస్ను మరోసారి తిరుగులేని శక్తిగా నిలబెడుతుందని గులాబీ శ్రేణులు నిశ్చితాభిప్రాయానికి వచ్చాయి. సీఎం కేసీఆర్కు ఉన్న ప్రజాదరణకుతోడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజల్లో బీఆర్ఎస్పై ఉన్న అభిమానం వంటి అనేక సానుకూలతలు తమను మరోసారి అలవోకగా గెలిపిస్తాయని అభ్యర్థులంతా ధీమాగా ఉన్నారు. బీఆర్ఎస్ జోరుతో బేజారైన కాంగ్రెస్, బీజేపీ కనీస పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవటంతో ఆ పార్టీల్లోని స్థానిక నాయకత్వం తమ భవిష్యత్తు కోసం మథనం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఉన్న పార్టీల్లో ఎంతకాలం కొనసాగినా ప్రయోజనం ఉండదని భావించిన కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లోకి క్యూ కడుతున్నారు. దీంతో బీజేపీ కార్యాలయాలు నిత్యం కొత్తవారి చేరికలతో కళకళలాడుతున్నాయి.
బీఆర్ఎస్లో నాయకులకు కొదువలేదు. పార్టీలో ఎక్కడ చూసినా బహుళ నాయకత్వం ఉన్నది. అభ్యర్థితోపాటు, వారికి సమాన సామర్థ్యాలున్న నాయకులు పుష్కలంగా ఉన్నారు. అయితే ఎంతమంది నాయకులున్నా క్రమశిక్షణగల సైన్యంగా పార్టీ అధినేత నిర్ణయించిన అభ్యర్థి గెలుపుకోసమే పనిచేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. మరోవైపు చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న ఉద్దేశంతో పార్టీలో అక్కడక్కడా ఉన్న చిన్నచిన్న అభిప్రాయబేధాలను కూడా అధినాయకత్వం సీరియస్గా తీసుకున్నది. పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేదిలేదని స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో టికెట్ రాని నేతలు కూడా పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కదులుతున్నారు. దీంతో అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్ఎస్ అసమ్మతి చెలరేగుతుందని, తిరుగుబాటు నేతలకు గాలం వేయవచ్చని గంపెడాశలు పెట్టుకొన్న విపక్షాలకు భంగపాటు తప్పలేదు.
కురుక్షేత్రంగా విపక్ష శిబిరాలు
అసెంబ్లీ ఎన్నికలకు సరైన అభ్యర్థులు దొరక్క కాంగ్రెస్, బీజేపీ, ఇతర విపక్ష పార్టీల నాయకత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. మరోవైపు మండలస్థాయి నేతలు కూడా ఎమ్మెల్యే టికెట్లు కావాలని ఆయా పార్టీల ప్రధాన కార్యాలయాలపై దండెత్తుతున్నారు. దీంతో ఆ పార్టీల కార్యాలయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ను ఓడిస్తామని బీరాలు పలికిన విపక్ష నేతలు, తీరా ఇప్పుడు సరైన అభ్యర్థులే దొరక్కపోవటంతో ఎన్నికలకు ముందే చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికి మూడుసార్లు సమావేశమైనా ఒక్క అభ్యర్థిని కూడా ఖరారుచేయలేకపోయింది. మనిషికో శిబిరంగా విడిపోయి నేతలు తమదైన ముఠా రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. ఇక ఎన్ని చింతన్ బైఠక్లు నిర్వహించినా అభ్యర్థుల కొరత బీజేపీని పట్టిపీడిస్తున్నది.
పాడి కౌశిక్రెడ్డికి అపూర్వ స్వాగతం
హుజూరాబాద్ టౌన్, సెప్టెంబర్ 2: హుజూరాబాద్ బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి శనివారం హుజూరాబాద్కు వచ్చిన మండలి విప్ పాడి కౌశిక్రెడ్డికి నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు హుజూరాబాద్లోని ఆర్టీసీ డిపో క్రాస్రోడ్ వద్ద గులాబీ గజమాలతో స్వాగతం పలికారు. వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి సుమారు 20 వేల మంది వరకు ప్రజా ఆశీర్వాద ర్యాలీకి తరలివచ్చారు. అంబేదర్ చౌరస్తాకు కొద్ది దూరంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్ కౌశిక్రెడ్డితో కలిసి వాహనంపై ఎకి కార్యకర్తలకు, నాయకులకు అభివాదం చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ర్యాలీ వాహనంపైకెకి కౌశిక్రెడ్డితో కలిసి ప్రసంగించగా యువకులు ఈలలు, చప్పట్లతో హోరెత్తించారు. కౌశిక్రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేయగా, అంతా చేతులు పైకెత్తి జైకొట్టారు. ఘన స్వాగతం పలికిన కార్యకర్తలకు నాయకులకు కౌశిక్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. హామీలన్నీ నెరవేరుస్తానని, అభివృద్ధిని చేసి చూపిస్తానని చెప్పారు.