హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో నిర్మించిన ఫ్లాట్లను దక్కించుకునేందుకు ఆశావహుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. గడువు ముగిసే నాటికి 39 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. ఆన్లైన్ లాటరీ ద్వారా ఫ్లాట్లను కేటాయిస్తే సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో పాటు దరఖాస్తుదారులు బహిరంగ లాటరీ కావాలని కోరుతుంటంతో అధికారులు ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నారు.
హైదరాబాద్లో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో డ్రా తీయాలని నిర్ణయించారు. ఈ నెల 27 నుంచి జూలై 1 వరకు అందరి సమక్షంలో పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. ప్రత్యేక రోలింగ్ డ్రమ్లను తయారు చేయించి వాటి ద్వారా బహిరంగ లాటరీ నిర్వహిస్తామని, ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. మొదట బండ్లగూడ, అనంతరం పోచారం ఫ్లాట్లను లాటరీ ద్వారా కేటాయించనున్నారు. దరఖాస్తుదారులకు టోకెన్ నంబర్లు ఇచ్చి లాటరీ తీస్తామని, ఈ మొత్తం ప్రక్రియను వీడియోతీయడంతో పాటు ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు. లాటరీ షెడ్యూల్, వివరాలను రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతామన్నారు.