హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాల పంపిణీ ఊపందుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో మంజూరు పత్రాల పంపిణీ చురుకుగా సాగుతున్నది. సోమవారం వరకు లక్షా ఆరు వేల పైచిలుకు అర్హులకు ఈ పథకాన్ని మంజూరుచేశారు. దశలవారీగా మొత్తం నాలుగు లక్షల మందికి మంజూరు పత్రాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
పేదల సొంతింటి కలను సాకారం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఓ వైపు డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమచుచేస్తూనే, మరోవైపు సొంత స్థలం ఉన్నవారు తమ ఇష్టమొచ్చిన విధంగా ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేసేందుకు గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒక్కో నియోజకవర్గంలో 3 వేల మంది చొప్పున రాష్ట్రంలో మొత్తం 4 లక్షల మందికి లబ్ధిచేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో రూ.12,000 కోట్లు కేటాయించింది. గత నెల 10వ తేదీవరకు దరఖాస్తులను స్వీకరించిన అధికారులు, వాటి పరిశీలించి ప్రాథమికంగా అర్హుల జాబితాలను సిద్ధంచేశారు. 15 లక్షల పైచిలుకు దరఖాస్తులు రాగా, అందులో 10 లక్షలకుపైగా అర్హులను గుర్తించారు.
ఇందులో సోమవారం నాటికి లక్షా ఆరు వేల మందికి పథకాన్ని మంజూరుచేశారు. ఇందులో అత్యధికంగా జగిత్యాల నియోజకవర్గంలో 8,000 మందికి మంజూ రు కాగా, ఖమ్మం, సంగారెడ్డిలలో 7 వేల పైచిలుకు, హైదరాబాద్, కామారెడ్డి, నల్లగొండ నియోజకవర్గాల్లో 6 వేలకుపైగా దరఖాస్తుదారులకు మంజూరు చేశారు. నియోజకవర్గాలవారీగా ఎంపికైన అర్హులకు మంజూరు పత్రాలను అందజేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన ఆలస్యం కావడంతో మంజూరులో కూడా కొంత జాప్యం జరుగుతున్నదని అధికారులు చెప్పారు. క్షేత్రస్థాయి అధికారుల పరిశీలన తరువాత జిల్లా మంత్రి, కలెక్టర్ ఆధ్వర్యంలోని పరిశీలన కమిటీ లబ్ధిదారులను ఎంపికచేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించారు. ఎంపికైన దరఖాస్తుదారులకు మూడు దశల్లో రూ.3 లక్షలు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ఎంపికైన లబ్ధిదారులకు ఇప్పటికే మంజూరు పత్రాలను అందజేస్తున్నారు. త్వరలోనే ఒక్కో నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున మొత్తం 3,65,975 మందిని గుర్తిం చే ప్రక్రియ పూర్తిచేసి మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు. మిగిలిన 35 వేలు సీఎం కోటా కింద మంజూరుచేస్తారని తెలిపారు.