సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
తల్లాడ, ఫిబ్రవరి 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ రానున్నదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనతో విద్యాబోధన మరింత మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని హర్షిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా తల్లాడలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. సైన్స్డే సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి సైన్స్ల్యాబ్ను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ సంధ్యారాణి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో దశల వారీగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ తొలి విడతగా రూ.7,252 కోట్లను కేటాయించారని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గంలోనే 134 పాఠశాలలు ఎంపికయ్యాయని చెప్పారు. ‘మన ఊరు – మన బడి’లో దాతలు, పూర్వవిద్యార్థులు, ఎన్నారైలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి విద్యార్థులతో కలిసి పుష్పాభిషేకం చేశారు. పాఠశాల ఆవరణలో 240 అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్ ముఖచిత్రం ఆకట్టుకొన్నది.