మహబూబ్నగర్ : ప్రతి మనిషిలో మార్పు తెచ్చిన మహనీయుడు గౌతమ బుద్ధుడని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గౌతమ బుద్ధునికి గొప్ప చరిత్ర ఉందని అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లి వద్ద బుద్ధ విహార్లో బుద్ధ విగ్రహావిష్కరణకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలలో ఉన్న బుద్ధుని చరిత్రను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన బుద్ధ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రారంభించనున్నారని మంత్రి పేర్కొన్నారు. బుద్ధుని విగ్రహం ఏర్పాటుకు భూమి కేటాయించామని, ఈ ప్రదేశంలోనే ధ్యానం చేసుకునేందుకు ధ్యాన మందిరం నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మయ్య, బాల పీరు, డాక్టర్ రామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.