‘రైతులకు నష్టం కలిగించే ఏ చర్యనైనా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. ఆరుగాలం కష్టపడి పనిచేసి అన్నంపెట్టే రైతన్నకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్న స్పష్టమైన సంకేతాలు వెళ్లాలి. తెలంగాణలో కల్తీ విత్తనాలు అమ్మితే అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.. అనే జంకు రావాలి. దేశంలో ఎక్కడా లేనివిధంగా కల్తీ విత్తనాల అమ్మకందారులపై పీడీ యాక్ట్ కేసులు పెడుతున్నాం’ – ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు (పార్టీ ప్రతినిధుల మీటింగ్, మే 17)
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయదారులపై పోలీసులు, అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా విక్రయదారులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి పోలీసులు విత్తన దుకాణాలపై దాడులు కొనసాగిస్తున్నారు. నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మే 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా 8,116 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. పెస్టిసైడ్స్ షాపుల్లో నిర్వహించిన సోదాల్లో సుమారు 151 లీటర్ల నకిలీ పురుగుమందులనూ జప్తు చేశారు. మొత్తం 33 కేసులు నమోదు చేసి, 39 మందిని అరెస్టు చేశారు.
నకిలీ విత్తనాలు, పురుగుమందు విక్రేతలపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నారు. 2014 నుంచి 2022 వరకు 1,932 మందిని అరెస్టు చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద 991 కేసుల నమోదు చేశారు. పదే పదే అక్రమాలకు పాల్పడుతూ.. రైతులను మరింత నష్టపరుస్తున్న షాపుల యాజమానులపై పీడీ యాక్ట్ కేసులు సైతం నమోదు చేసి, లైసెన్స్లు రద్దు చేస్తున్నారు. బుద్ధిమార్చుకోని విత్తన విక్రేతలపై పోలీసులు 58 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశారు.
నకిలీ విత్తనాలు అమ్మి.. రైతులను నట్టేట ముంచుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా ఇతర అనుబంధ శాఖల అధికారులతో పోలీసులు సమన్వయం చేసుకుంటూ మరింత విస్తృతంగా సోదాలు జరపాలి. పదేపదే అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోండి.
– అంజనీకుమార్, రాష్ట్ర డీజీపీ