ఇప్పటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందిస్తున్న తెలంగాణ.. ఈ విద్యాసంవత్సరం నుంచి నోట్బుక్స్ పంపిణీకి మాయత్తమవుతున్నది. 1.5 కోట్ల వర్క్బుక్స్తోపాటు 1.17 కోట్ల నోట్బుక్స్ పంపిణీకి విద్యాశాఖ ఏర్పాటు చేస్తున్నది.
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈసారి పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్తోపాటు నోట్బుక్స్, వర్క్బుక్స్ కూడా అందజేయాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలుకు ముమ్మర కసరత్తు జరుగుతున్నది. ఇందుకోసం ఇప్పటికే ఓ ప్రణాళికను రూపొందించిన అధికారులు.. 200 పేజీల నాణ్యమైన నోట్బుక్స్, వర్క్బుక్స్ను సిద్ధం చేస్తున్నారు. గోల్కొండ బ్రాండ్తో కూడిన ఈ పుస్తకాలు ‘మన ఊరు-మన బడి’ థీమ్ అట్టలను కలిగి ఉంటాయి. ప్రాథమిక తరగతుల్లోని 11.27 లక్షల మంది విద్యార్థులకు 3 చొప్పున మొత్తం 33.82 లక్షల వర్క్బుక్స్ను ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.34.70 కోట్లు వెచ్చించనున్నది. 6 నుంచి ఇంటర్ వరకు అభ్యసిస్తున్న 12.39 మంది విద్యార్థులకు అవసరాన్ని బట్టి 6 నుంచి 12 చొప్పున మొత్తం 1.17 కోట్ల నోట్బుక్స్ను పంపిణీ చేసేందుకు రూ.56.24 కోట్లు ఖర్చు చేయనున్నది. జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాలలతోపాటు, కేజీబీవీలు, మాడల్ స్కూళ్లు, అర్బన్ రెసిడెన్షియల్ సెంటర్లు, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులకు అందజేయనున్న ఈ పుస్తకాలను తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ (టీఎస్టీపీసీ) ద్వారా సేకరిస్తున్నారు.
మొత్తం 90.94 కోట్ల ఖర్చు
రాష్ట్రంలోని విద్యార్థులకు తొలిసారిగా ఉచితంగా నోటుబుక్స్, వర్క్బుక్స్ను ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయా న్ని అమలుపరుస్తున్నాం. ఇందుకోసం మొత్తం రూ.90.94 కోట్లు ఖర్చు చేస్తున్నాం. స్కూళ్లు ప్రారంభమైన తర్వాత విద్యార్థులకు పాఠశాలల్లోనే వీటిని అందజేస్తాం. దీంతో ప్రభుత్వ పాఠశాలు మరింత బలోపేతమై అడ్మిషన్లు పెరుగుతాయి.
– పీ సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి