రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ‘నేతన్నల జీవన ప్రమాణాలు మెరుగు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ లాంటి వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు అధికశాతం సిరిసిల్లకే ఇచ్చి కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించాలి. సిరిసిల్లలో అధిక శాతం మంది పవర్లూం పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న 20 వేల పైచిలుకు మరమగ్గాలకు 90 శాతం విద్యుత్తు సబ్సిడీ ఇవ్వాలి’ అని సిరిసిల్ల మున్సిపల్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. రాజన్న సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అధ్యక్షతన శనివారం జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో 18 అంశాలపై చర్చించి ఆమోదించారు. ఈ మేరకు చైర్పర్సన్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి నేతన్నల ఆకలిచావులు, ఆత్మహత్యలకు పాల్పడ్డారని, కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు, వివిధ వస్ర్తాల తయారీ ఆర్డర్లు ఇచ్చి కార్మికులకు ఉపాధి కల్పించిందని గుర్తుచేశారు.
ఈ ఆర్డర్ల వల్ల కార్మికులతోపాటు, యజమానులు, ఆసాములు, పరిశ్రమలకు చేయూత లభించిందని తెలిపారు. గత ప్రభుత్వం ఆదుకున్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని, 2018లో మున్సిపాల్టీలో విలీనం చేసిన సిరిసిల్ల శివారులోని పెద్దబోనాల, చిన్నబోనాల, పెద్దూరు, సర్ద్ధాపూర్, రాజీవనగర్, చంద్రంపేట, రగుడు గ్రామాలను ఆయా గ్రామాల ప్రజల కోరిక మేరకు యథావిధిగా గ్రామ పంచాయతీలుగా కొనసాగించాలని తీర్మానించినట్టు వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, అద్దె ఇంటి వారికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు రాయితీ, ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని సమావేశం చర్చించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ మీర్జా అలీబేగ్, టీపీవో అన్సారి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.