నల్లగొండ : జిల్లాలో పోడు భూముల సమస్యల శాశ్వత పరిష్కారంతో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని మంత్రి జి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న పోడు వ్యవసాయదారులకు సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపుటకు, దీనితోపాటు భవిష్యత్తులో అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా చేపట్టే సంరక్షణ చర్యలపై ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
అంతకుముందు అఖిలపక్ష సమావేశానికి హాజరైన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సలహాలను, సూచనలను అందజేశారు.
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎం.పి.ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, రవీంద్ర కుమార్, భాస్కర్ రావు, గాదరి కిశోర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రాంచంద్ర నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి యం.సుధాకర్ రెడ్డి, టి.డి.పి నల్గొండ పార్లమెంట్ నియోజక వర్గ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, టి.ఆర్.ఎస్. జిల్లా అధికార ప్రతినిధి బక్క పిచ్చయ్య, సి.పి.ఐ పట్టణ కార్యదర్శి గాదెపాక రమేష్, ఎం.ఐ. ఎం. నుంచి ఖాజా గౌస్ మహియుద్దీన్ హషం, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొర్ర శంకర్ నాయక్,తెలంగాణ రైతు సంఘం నుండి నాగి రెడ్డి,పోడు సమస్య ఉన్న 13 మండలాలకు చెందిన ఎం.పి.పి.లు, జడ్పీటీసీలు గిరిజన సంఘాల నాయకులు అఖిల పక్ష సమావేశంలో పాల్గొని తమ సలహాలను,సూచనలు అంద చేశారు.
ప్రభుత్వం పోడు సమస్య పరిష్కారానికి చేస్తున్న కృషికి అన్ని పార్టీల నాయకులు స్వాగతిస్తూ ఏకగ్రీవంగా మద్దతు పలికారు. మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సుదీర్ఘమైన పోడు సమస్య శాశ్వత పరిష్కారానికి సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
అందుకు అనుగుణంగా అటవీ హక్కుల చట్టం- 2005 నియమనిబంధనల ప్రకారం పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి శాశ్వత పరిష్కారం దిశగా సమస్యకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని మంత్రి అన్నారు. నల్గొండ జిల్లాలో17 లక్షల 59 వేల 885 ఎకరాల జియోగ్రఫీ ప్రాంతం కాగా, ఒక లక్ష 56 వేల 164 ఎకరాలలో అటవీ ప్రాంతం విస్తరించి ఉందని, జిల్లాలోని 13 మండలాల్లో 63 గ్రామాల్లో 164 హ్యాబిటేషన్ లలో 13771 వేల ఎకరాల అటవీ భూమి ఆక్రమణలో ఉందని మంత్రి వివరించారు. పోడు వ్యవసాయదారులకు న్యాయం చేసేందుకు అడవులను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.
తాను కూడా సబ్ కమిటీ లో సభ్యునిగా ఉన్నానని, అటవీ హక్కుల చట్టం- 2005 పరిధి కి లోబడి పోడు వ్యవసాయ దారులకు న్యాయం చేకూర్చేందుకు అఖిలపక్ష సభ్యుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్.ఓ.ఎఫ్.ఆర్.2005 చట్టం, గ్రామ కమిటీ లు హ్యాబిటేషన్ వారీగా, డివిజన్ వారీగా,జిల్లా కమిటీ లు ఏర్పాటు,కమిటీ ల బాధ్యతలు గురించి మంత్రి వివరించి సందేహాలు నివృత్తి చేశారు. అడవుల పునరుద్ధరణలో దేశం లో రాష్ట్రం ముందు ఉందని అన్నారు.
పోడు భూముల సమస్య పరిష్కారం కు రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులకు అటవీ హక్కు లు కల్పించేందుకు చర్యలు తెరసుకుంటామని అన్నారు. సమస్య పరిష్కారం చర్యలకు గాను అటవీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో పారదర్శకంగా తమ విధులను మరింత బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని మంత్రి సూచించారు.