హైదరాబాద్, మార్చి 8(నమస్తే తెలంగాణ)/భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. తక్షణమే స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు అవసరం మేరకు అదనపు బలగాలను రంగంలోకి దింపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. శాంతిభద్రతకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మహమూద్అలీ, డీజీపీ మహేందర్రెడ్డిలను కోరుతూ మంత్రి కేటీఆర్ సోమవారం ఓ ట్వీట్ చేశారు.
భైంసాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నట్టు హోంమంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భైంసాలో పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. భైంసా ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆరా తీసినట్టు కేంద్ర సహాయ మంత్రి జి కిషన్రెడ్డి పేర్కొన్నారు.
భైంసాలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందొద్దని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ విష్ణు వారియర్, రెవెన్యూ అధికారులతో కలిసి అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అంతకుముందు సీపీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే 45 మంది అనుమానితులను కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా పరిశీలించి సంబంధం లేని వారిని వదిలేస్తామని తెలిపారు.