హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో నాలుగు తెలంగాణ డయాగ్నోస్టిక్ (టీడీ) హబ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 31 హబ్లు ఉన్నాయని, గిరిజన ప్రాంతాల ప్రజలకు సేవలను మరింత చేరువ చేసేందుకు ఈ నాలుగు హబ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, ములుగు జిల్లా ఏటూరునాగారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, నాగర్కర్నూల్ జిల్లా మన్నూర్లో ఈ నాలుగింటిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అధికారులు బుధవారం నుంచి ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.