హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): వాలంతరీ (వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్) పాలకమండలి కార్యనిర్వాహక కమిటీలను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం ఏడుగురితో ఉన్న మండలిని 20 మందికి విస్తరించింది. మండలి అధ్యక్షుడిగా సీఎం, ఉపాధ్యక్షుడిగా నీటిపారుదలశాఖ మంత్రి, సభ్యులుగా నీటిపారుదల, ఆర్థిక శాఖల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఈఎన్సీ (జనరల్), కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) సీఈ, వాలంతరీ మాజీ డీజీలు, వ్యవసాయ యూనివర్సిటీలోని రిసెర్చ్ డైరెక్టర్లు, సభ్య కార్యదర్శిగా వాలంతరీ డీజీ కొనసాగనున్నారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) చైర్మన్గా నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి, కార్యదర్శి, కో-చైర్మన్గా వాలంతరీ డీజీ వ్యవహరించనున్నారు. గతంలో ఈ కమిటీలో నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల సీఈలు ఉండగా.. ప్రస్తుతం జగిత్యాల, నల్లగొండ సీఈలను సభ్యులుగా చేర్చారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరువు పీడిత ప్రాంతాలతోపాటు మెట్ట ప్రాంతాల్లో నీటిపారుదల వ్యవస్థ నిర్వహణ, ఇప్పటికే ఉన్న వ్యవస్థ వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా వాలంతరీ కృషి చేస్తుంది. ఆ దిశగా పరిశోధనలను సాగించడంతోపాటు, అధికారులకు తగిన నైపుణ్య శిక్షణను కూడా అందిస్తుంది. ఆయా కార్యకలాపాల పర్యవేక్షణకు సంబంధించిన నిర్ణయాలను వాలంతరీ పాలకమండలి, కార్యనిర్వాహక కమిటీలు తీసుకుంటాయి.