హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు రంగానికి బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. రూ.12,715.20 కోట్లను కేటాయించింది. ఇది నిరుటి బడ్జెట్ కంటే రూ.516.5 కోట్లు అదనం. రైతులకు 24 గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్తును అందిస్తున్న ప్రభుత్వం.. అదేస్థాయిలో వివిధ వర్గాలకు సబ్సిడీని అందిస్తున్నది. పరిశ్రమలతోపాటు సెలూన్లు, ఇస్త్రీ షాపులు నిర్వహించే చిన్న చిన్న వృత్తులవారికి విద్యుత్తు సబ్సిడీ అందిస్తున్నది. 100 యూనిట్లలోపు వినియోగించే ఎస్సీ, ఎస్టీ గృహాలకూ రాయితీ ఇస్తున్నది.
ఈ నేపథ్యంలో వీటన్నింటికీ సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.12,715.20 కోట్ల నిధులను బడ్జెట్లో పొందుపర్చారు. ఇందులో అత్యధికంగా వ్యవసాయానికి సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్తుకు కేటాయిస్తున్నది. ప్రతి నెలా సుమారు రూ.800 కోట్ల వరకు సబ్సిడీ అందిస్తున్నది. అయితే ఏటా వ్యవసాయ కనెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలోలబ్ధిదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ఇందుకు తగినట్టుగానే బడ్జెట్లోనూ భారీగా నిధులు పెంచారు. 2022-23తో పోల్చుకుంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.516.50 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం. నిరుటి బడ్జెట్లో రూ.12,198.70 కోట్లు (రివైజ్డ్ ఎస్టిమేట్స్) కేటాయించగా.. తాజాగా రూ.12,715.20 కోట్లకు పెంచింది. దీనితో ట్రాన్స్కో, జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రావాల్సిన సబ్సిడీ బకాయిలన్నీ ఠంచనుగా అందనున్నాయి.