హైదరాబాద్, అక్టోబర్5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో 88 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక సహాయ పౌరసంబంధాల అధికారి, ఇద్దరు పబ్లిసిటీ అసిస్టెంట్ల చొప్పున నియమించనున్నారు. హైదరాబాద్ కమిషనరేట్లో ఒక పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ శాఖలో పోస్టులను భర్తీ చేయడం ఇదే తొలిసారి. ఈ మేరకు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ అమోద ముద్రవేసినందుకు మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఆ శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.