హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): అగ్నిమాపక శాఖలో కొత్త వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. రూ.32.11 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులతో ఆరు రకాల వాహనాలు కొనేందుకు శాఖ సిద్ధమైంది. సోమవారం ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఉన్న కొన్ని వాహనాలు పదేండ్ల నాటివని, అనుకున్న సమయానికి ఫైర్ స్పాట్కు చేరుకోవడానికి కొన్ని అవాంతరాలు ఎదురవుతున్న దృష్ట్యా ప్రభుత్వానికి తాము ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు.
ఆ ఫైల్ను పరిశీలించిన సీఎం కేసీఆర్, వెంటనే ఆర్థిక అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వెల్లడించారు. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలను అన్ని జిల్లాల్లోని కేంద్రాలకు పంపిస్తామని చెప్పారు. అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే హైదరాబాద్, టైర్-2 నగరాలకు సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ వాహనాల పంపిణీలో ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిపారు. క్విక్ రెస్పాన్స్ టెండర్స్, వాటర్ టెండర్స్కు కొనుగోలుకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న అత్యాధునిక వాహనాల్లో రెస్క్యూకు సంబంధించిన వస్తు సామగ్రి తీసుకెళ్లొచ్చాని తెలిపారు.