B.Ed | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : బీఈడీ చదవాలనుకొనే విద్యార్థులకు శుభవార్త. ఇంటర్ పూర్తికాగానే డిగ్రీతో పాటు నేరుగా బీఈడీలో చేరవచ్చు. అంతేకాదు.. రెండేండ్ల బీఎడ్ కోర్సుకు బదులుగా ఏడాదిలోనే ఈ కోర్సును పూర్తిచేయొచ్చు. ఇందుకు అవకాశం కల్పిస్తున్నదే నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ). ఈ కోర్సును రాష్ట్రంలోని మూడు విద్యాసంస్థల్లో నిర్వహిస్తున్నారు.
ఐటీఈపీ కోర్సులో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (ఎన్సీఈటీ) పేరిట పరీక్ష నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలప్పగించారు. 2024 -25 విద్యాసంవత్సరానికి ఎన్సీఈటీ ప్రవేశపరీక్షకు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. వివరాలకు www. nta.ac.in, https:ncte.samasth .ac.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
దేశవ్యాప్తంగా 64 విద్యాసంస్థల్లో నాలుగేండ్ల ఐటీఈపీ కోర్సును నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మూడు విద్యాసంస్థలు ఈ కోర్సును ఆఫర్చేస్తున్నాయి. వీటిల్లో 250 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మౌలానా అజాద్ ఉర్దూ యూనివర్సిటీలో బీఏ బీఎడ్, బీఎస్సీ బీఎడ్, బీకాం బీఎడ్ మూడు కోర్సులను నిర్వహిస్తున్నారు. ఒక్కో బ్రాంచిలో 50 చొప్పున మొత్తం 150 సీట్లున్నాయి. ఇక ఎన్ఐటీ వరంగల్లోనూ బీఎస్సీబీఎడ్ ఒకే ఒక్క కోర్సును నిర్వహిస్తుండగా, 50 సీట్లతో ఈ కోర్సును నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లక్షెట్టిపేటలో బీఏ బీఎడ్ కోర్సులో మరో 50 సీట్లున్నాయి.