మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 24 : భవిష్యత్ సౌరశక్తిదేనని.. సౌరశక్తిని వినియోగించుకోవాలని సోలార్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ముంబై ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ చేతన్ సింగ్ సోలంకి అన్నారు.
ఆచార్య సోలంకి 2020లో ప్రారంభమైన దేశవ్యాప్త ఎనర్జీ సోలార్ బస్ యాత్ర బుధవారం సాయంత్రానికి మెదక్ పట్టణానికి చేరుకుంది. ఈ యాత్రకు సిద్ధార్థ్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్ చౌదరి, ప్రిన్సిపాల్ సంధారాణి ఘన స్వాగతం పలికారు.
అనంతరం సిద్ధార్థ్ స్కూల్లో నిర్వహించిన సోలార్ అవగాహన సదస్సులో సొలంకి మాట్లాడారు. సౌరశక్తి వినియోగంతో పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు. విద్యుత్తు శక్తి వనరులను విచ్చలవిడిగా వినియోగించడం వలన భవిష్యత్ తరాలకు తీవ్ర ఇబ్బందులు ఏదురయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఇది తెలియజేయడానికి 11 సంవత్సరాల పాటు ఈ యాత్ర ప్రారంభించనాని సొలంకి వెల్లడించారు. ఈ సందర్భంగా సోలార్ బస్సు, అందులోని సౌకర్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
సౌరశక్తిని వినియోగిస్తామని విద్యార్థులతో సొలంకి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. సిద్దార్థ్ యాజమాన్యం సొలంకికి జ్ఞాపిక అందజేశారు.