హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ స్థాపనకు సోమవారం పునాది రాయి పడనున్నది. తైవాన్కు చెందిన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ టెక్నాలజీస్కు సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో శంకుస్థాపన చేయనున్నారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు, ఫాక్స్కాన్ టెక్నాలజీస్ గ్రూప్ చైర్మన్ యంగ్లూతోపాటు మంత్రి సబితారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తదితరులు పాల్గొంటారు.
మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్కాన్. సుమారు 70 శాతం యాపిల్ ఐఫోన్లను ఫాక్స్కాన్ కంపెనీయే తయారు చేస్తున్నది. కొంగరకలాన్లో ఫాక్స్కాన్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 196 ఎకరాల స్థలాన్ని కేటాయించగా, సుమారు రూ.1,656 (200 మిలియన్ డాలర్లు) కోట్లకుపైగా పెట్టుబడితో ఫాక్స్కాన్ ఇక్కడ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. ఇందులో దాదాపు 35 వేల మందికి ప్రత్యక్ష్యంగా ఉద్యోగాలు లభించనున్నాయి. యాపిల్ సంస్థ నుంచి ఇప్పటికే ఫాక్స్కాన్కు భారీ ఆర్డర్ రావడంతో వచ్చే ఏడాది చివరికల్లా ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకొన్నది. యాపిల్ కంపెనీ ఎయిర్పాడ్లు, వైర్లెస్ ఇయర్ఫోన్ల తయారీ ఆర్డర్ను ఫాక్స్కాన్కు అప్పగించింది. ఇప్పటివరకూ మొబైల్ ఫోన్ల తయారీకే ప్రాధాన్యమిచ్చిన ఫాక్స్కాన్, ఇప్పుడు ఎయిర్పాడ్ల తయారీలోకి అడుగు పెడుతున్నది. ఇటీవలే ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్లూ నేతృత్వంలోని కంపెనీ ప్రతినిధిబృందం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో సమావేశమై పరిశ్రమ ఏర్పాటుపై చర్చించింది.
ఫాక్స్కాన్ పరిశ్రమ రంగారెడ్డి జిల్లా కు మణిహారం కానున్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే జిల్లాలో ఐటీతోపాటు వివిధ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. సోమవారం కంపెనీకి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇందుకోసం సకల ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, జిల్లా అధికార యంత్రాంగం ఆదివారం పరిశీలించింది.