హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): బీసీలకు కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నదని ఓబీసీ ఎంపీల ఫోరం మండిపడింది. కేం ద్రం వైఖరిని పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టాలని నిర్ణయించింది. పార్లమెం ట్ ప్రాంగణంలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో మంగళవారం ఓబీసీ ఎంపీల ఫోరం సమావేశమైంది. దశాబ్దాలుగా విద్యా, ఉద్యోగాల్లో కులగణన లేకపోవడంతో బీసీలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సగానికిపైగా ఉన్న బీసీ వర్గాలకు కనీసం మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయటం లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కులగణన చేయాలని తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, బీహార్ రాష్ర్టాల అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. బీసీ కులగణన విషయంలో కేంద్రానికి పట్టింపులేకుండా పోతున్నదని ఎంపీ ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. జనాభా లెక్కల సేకరణ సమయంలో బీసీ కులగణన చేపడతామని 2018లో కేంద్ర హోంమంత్రి చేసిన పేర్కొన్నా ఇప్పటివరకు దీని విధి విధానాల రూపకల్పన చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న బీసీ వ్యతిరేక వైఖరిని దేశానికి తెలిసేలా ఎండగట్టాలని ఓబీసీ ఎంపీల ఫోరం నిర్ణయించింది.