మును‘గోడు’ను తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫ్లోరోసిస్ బాధితులు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఉపఎన్నికల్లో తాము టీఆర్ఎస్కే అండగా ఉంటామని, కారు గుర్తుకు ఓటేసి కృతజ్ఞత చాటుకుందామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని మిషన్ భగీరథ పైలాన్ వద్ద ఫ్లోరోసిస్ బాధితులు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్కు అండగా నిలబడుతామని తీర్మానించడంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ధన్యవాదాలు తెలిపారు.
చౌటుప్పల్, అక్టోబర్ 29: మునుగోడు నియోజకవర్గంలోని ఫ్లోరోసిస్ బాధితులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉప ఎన్నికలో తామంతా టీఆర్ఎస్కే అండగా నిలబడతామని తెలిపారు. కారు గుర్తుపై ఓటు వేసి కృతజ్ఞతలు తెలుపుకుంటామని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని మిషన్ భగీరథ పైలాన్ వద్ద శనివారం సమావేశమైన ఫ్లోరోసిస్ బాధితులు ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఫ్లోరైడ్ రక్కసితో ఆరు దశాబ్దాలపాటు అతలాకుతలం అయినా బీజేపీ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఫ్లోరైడ్ విష జలాలను తాగుతూ దివ్యాంగులుగా మారినా కండ్లున్న కబోదుల్లా బీజేపీ నేతలు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని తిరిగిన అప్పటి ఉద్యమ నాయకుడు, ప్రస్తుత సీఎం కేసీఆర్ తమ బాధను చూసి కన్నీటి పర్యంతమయ్యారని గుర్తుచేశారు. సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఫ్లోరైడ్ శాశ్వత నిర్మూలనకు మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చారని హర్షం వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఫ్లోరైడ్హ్రిత నీరు తాగుతూ సంతోషంగా ఉన్నామని తెలిపారు.
ఫ్లోరైడ్ బాధితులకు కృతజ్ఞతలు: మంత్రి కొప్పుల
ఫ్లోరోసిస్ నిర్మూలనకు చర్యలు తీసుకున్న సీఎం కేసీఆర్కు అండగా నిలబడతామని బాధితులు ప్రకటించడం హర్షణీయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఫ్లోరైడ్ నిర్మూలన కోసం ఫ్లోరోసిస్ బాధితుడు అంశల స్వామి 35 ఏండ్లు ఉద్యమం చేశారని గుర్తుచేశారు. ఆరు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఫ్లోరోసిస్తో అతలాకుతలమయ్యారని ఆవేదన చెందారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫ్లోరోసిస్ నిర్మూలనకు పైసా నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది ఎకరాల స్థలం కేటాయించినా తెలంగాణలో కాకుండా మరో రాష్ట్రంలో ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేశారని ధ్వజమెత్తారు. ఉద్యమ నాయకుడిగా నియోజకవర్గంలో పర్యటించిన కేసీఆర్ ఈ ప్రాంత బిడ్డల బాధలను చూసి కన్నీటి పర్యంతమయ్యారని తెలిపారు. 60 ఏండ్లలో తీరని ఫ్లోరోసిస్ బాధను సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో తీర్చి చూపించారని కొనియాడారు. ఫ్లోరోసిస్ అంతానికి సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శంగా మారిందని కితాబిచ్చారు.