సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టులోకి గత వారం రోజులుగా కొనసాగిన వరద కాస్త తగ్గు ముఖం పట్టింది. జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ పరిసర ప్రాంతాలలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు ఒక టీఎంసీ నీరు వరద రూపంలో వచ్చి చేరింది.
ఇంకా ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, సైగాంలలో మోస్తరు వర్షాలు కురిశాయని, ఆయా ప్రాంతాల్లో అధిక వర్షం కురిస్తే.. ప్రాజెక్టులోకి వరద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 19.400 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ఇన్ ఫ్లో 699 క్యూసెక్కులు వస్తుండగా..అవుట్ ఫ్లో 1358 క్యూసెక్కులు వెళ్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.