బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తారని ఎక్కడా లేదు
ఏడాదిలో తొలి సమావేశాన్నే గవర్నర్ ప్రారంభిస్తారు
ప్రస్తుత సభ గత సమావేశాలకు కొనసాగింపే
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కే నాగేశ్వర్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ను ఆహ్వానించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ స్పష్టంచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి రాజ్యాంగ ఉల్లంఘనకూ పాల్పడలేదని, శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణ రాజ్యాంగానికి లోబడే జరుగుతున్నదని మంగళవారం విడుదల చేసిన వీడియోలో వివరించారు. ‘రాజ్యాంగంలో ఎక్కడ కూడా బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ను పిలువాలని లేదు. గవర్నర్ ప్రసంగం ఉండాలని, బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంభిస్తారని లేదు’ అని నాగేశ్వర్ పేర్కొన్నారు. ‘రాజ్యాంగంలోని 176 (1)లో శాసనసభను ఉద్దేశించి లేదా రెండు సభలు ఉన్నట్లయితే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ రెండు సందర్భాల్లో ప్రసంగిస్తారని చెప్పారు. ఒకటి సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్తగా సభ కొలువుదీరినపుడు, రెండోది ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇయర్’ అని తెలిపారు. ‘ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఏప్రిల్ ఒకటో తేదీకి ముందు బడ్జెట్ ఆమోదం పొందాలి. కొత్త సంవత్సరం జనవరి ఒకటో తేదీన మొదలవుతుంది.
దీంతో సహజంగానే బడ్జెట్ సమావేశాలు తొలి సమావేశాలుగా ఉంటాయి. దీంతో తొలి సమావేశాలైన బడ్జెట్కు ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. కాలక్రమంలో బడ్జెట్ సమావేశాల ప్రారంభంలోనే గవర్నర్ ప్రసంగం ఉంటుందన్నట్టు మారిపోయింది. ఈ ఏడాది ఇప్పుడు జరుగుతున్నది తొలి సమావేశమే కదా అని అందరూ అనుకోవచ్చు. కానీ, గత సమావేశాలు ప్రొరోగ్ కాలేదు. ప్రొరోగ్ అయితేనే పూర్తయినట్టు లెక్క. అంటే గతంలో జరిగిన సమావేశాలకు తాత్కాలిక విరామం ఇచ్చినట్టు. తాజాగా శాసనసభ, శాసనమండలి సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలయ్యింది. దాంట్లో తెలంగాణ రెండో శాసనసభ ఎనిమిదో సెషన్.. రెండో మీటింగ్, శాసనమండలి 18వ సెషన్, సెకండ్ మీటింగ్ అని ఉన్నది. అంటే గతేడాది జరిగినదానికి కొనసాగింపు మాత్రమే’ అని పేర్కొన్నారు.