Secretariat | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తొలిసారి భారీ సదస్సు జరిగింది. ఇప్పటివరకు సచివాయంలో మంత్రులతో, అధికారులతో సమీక్షలు జరిగాయి. గురువారం నాటి సదస్సులో మొదటిసారి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. వారితోపాటు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎం సలహాదారులు, సీఎంవో కార్యదర్శులు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. దీంతో ఆరో అంతస్థులోని సమావేశ మందిరం కళకళలాడింది.
సీఎం కేసీఆర్ అంశాలవారీగా లోతుగా వివరిస్తుంటే అధికారులంతా శ్రద్ధగా విన్నారు. స్వరాష్ట్రంలో గణనీయ ప్రగతి నమోదు చేసిన వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు, ఆర్ అండ్ బీ తదితర శాఖల మంత్రులను, అధికారులను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. సమావేశం చప్పట్లతో హర్షం వ్యక్తంచేసింది. ఇటీవల సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతికి సమావేశం ప్రత్యేక అభినందనలు తెలిపింది. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సాధించిన అభివృద్ధిని దేశం నలుదికులా కనిపించేలా, పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు మూడు వారాలు కృషిచేస్తామని కలెక్టర్లు తెలిపారు.