హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సెకండ్వేవ్ పూర్తిగా తొలగిపోలేదని, నిర్లక్ష్యం చేస్తే కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నదని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్హెల్త్ జీ శ్రీనివాసరావు చెప్పారు. ప్రజలు అసలు కరోనా వైరస్సే లేనట్టు ప్రవర్తిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మన నిర్లక్ష్యమే మనకు నష్టం కలిగిస్తుందని, మూడో వేవ్కు కారణమవుతుందని హెచ్చరించారు. మంగళవారం కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ రమేశ్రెడ్డితో కలిసి మాట్లాడారు. ‘ప్రమాదకర డెల్టా వేరియంట్తో రెండోవేవ్లో ఎంతో నష్టాన్ని చవిచూశాం. ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించటం వల్ల కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లోని పలుప్రాంతాల్లో ఇంకా కేసులు నమోదవుతున్నాయి. గతంలో వైరస్ బారినపడని వారు, టీకాలు వేసుకోనివారినే వైరస్ టార్గెట్ చేస్తున్నది’ అని శ్రీనివాసరావు తెలిపారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వైద్యారోగ్యశాఖకు అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చారని, ప్రత్యేకంగా రెండుసార్లు హెలికాప్టర్ పర్యటన చేసేలా ఆదేశాలు జారీచేశారని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొవిడ్ అదుపులో ఉన్నదని, పండుగల వేళ అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. టీకాల లక్ష్యంలో తెలంగాణ ఇప్పటివరకు 50 శాతం దాటిందని, ఈ నెల కేటాయింపుల్లో భాగంగా 18 లక్షల డోసులకు అదనంగా మరో 4.50 లక్షల టీకాలు మంగళవారం సాయంత్రం వస్తాయని వివరించారు. కరోనా ఉన్నందున రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలని, కొవిడ్ నిబంధనలు పాటించకుండా పాదయాత్రలు, సమావేశాలు నిర్వహించటం సరికాదని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
కొన్ని జిల్లాల్లో ఇంకా ఎక్కువ కేసులు నమోదయ్యేందుకు పెండిళ్లు, ఫంక్షన్లు, ఇతర జనం గుమిగూడే కార్యక్రమాలేనని గుర్తించినట్టు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్రెడ్డి చెప్పారు. హెలికాప్టర్ పర్యటన ద్వారా పలుప్రాంతాల్లో పరిశీలించిన అనంతరం ఎక్కువ కేసులు నమోదయ్యే జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు వెల్లడించారు. కేసులను మ్యాపింగ్ చేసి, గ్రామాలు, మండలాల వారీగా రికార్డులు తయారు చేస్తున్నట్టు చెప్పారు. మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, జిల్లాల్లోనూ పిల్లల కోసం ప్రత్యేకంగా పడకలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ప్రైవేటు దవాఖానల్లో ఆక్సిజన్ పడకలకు డిమాండ్ పెరుగుతున్నదన్న వార్తలను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్రెడ్డి కొట్టిపారేశారు.
మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం కరోనా వ్యాక్సిన్ తొలిడోసు వేసుకొన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. ‘ఈ రోజు నా తొలి డోసు టీకా వేసుకొన్నా. డాక్టర్ కృష్ణ, నర్సు కెరీనా జ్యోతి, హెల్త్కేర్ వర్కర్లు అందరికీ కృతజ్ఞతలు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ వ్యాక్సినేషన్ లక్ష్యం 2.20 కోట్ల మంది
చేరుకొన్న లక్ష్యం 1.35 కోట్లు
మొదటి డోస్ వేసుకొన్నవారు 50 శాతం
రెండో డోసు తీసుకొన్నవారు
30 శాతం