Teachers Transfers | హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధమైంది. హైకోర్టులో మార్గం సుగమం కావడంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి శుక్రవారం పూర్తిస్థాయి షెడ్యూల్ ఇచ్చేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 3వ తేదీ నుంచి ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ ప్రారంభం కానున్నది. అక్టోబర్ 3వ తేదీతో ముగియనున్నది. సెప్టెంబర్ ఒకటి కటాఫ్ తేదీగా లాంగ్ స్టాండింగ్ ఉపాధ్యాయులకు ఎనిమిదేండ్లు, ప్రధానోపాధ్యాయులకు ఐదేండ్ల నిబంధన వర్తింపజేస్తారు. ఐదు, ఎనిమిదేండ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయుల, ప్రధానోపాధ్యాయుల స్థానాలను ఖాళీలుగా ఉన్న జాబితాలో చేరుస్తారు. పదవీ విరమణకు మూడేండ్లలోపు సర్వీసున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ నుంచి మినహాయిస్తారు. అన్ని రకాల పదోన్నతులకు సంబంధించి సీనియార్టీ జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా స్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
బదిలీల షెడ్యూల్ నేపథ్యంలో కొత్త దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నారు. దరఖాస్తుల సవరణకు మరోసారి అవకాశం ఇవ్వనున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. అదనంగా స్పౌజ్ బదిలీల కోసం దరఖాస్తు కూడా పెట్టుకోవచ్చు, తొలిగించుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 59 వేల మందికిపైగా ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్లోనే పదోన్నతుల ప్రక్రియ పూర్తికి విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. రాష్ట్రంలో 1,947 మందికి గెజిటెడ్ హెడ్ మాస్టర్లుగా, 2,162 మందికి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లుగా, 5,870 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించనున్నాయి.
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు హర్షం ప్రకటించారు. గురువారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డితోవెళ్లి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జీ సదానందంగౌడ్, ఎం పర్వత్రెడ్డి కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు న్యాయస్థానం తీర్పుకు లోబడి ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పూర్తి పారదర్శకతతో ఎలాంటి అపోహలకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. దీనికి సంబంధించిన విధి, విధానాలను రూపొందించాలని సూచించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విద్యాశాఖ తరపున వ్యక్తిగతంగా సందేశాలు(మెసేజ్లు) పంపాలని చెప్పారు. ఆన్లైన్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీఎస్ ఆన్లైన్ అధికారులకు సూచించారు. జిల్లాల్లో ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు రాష్ట్రస్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని ఆదేశించారు. సమావేశంలో పాఠశాల విద్య సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు.