Hyderabad | వనస్థలిపురం, ఆగస్టు 19: తాను ఒంటరితనంతో కుమిలిపోతుంటే.. తన నుంచి దూరమై బిడ్డ, తల్లిదండ్రులతో కలిసుంటున్న భార్యకు ఆ సంతోషాన్ని లేకుండా చేయాలని కన్నబిడ్డనే కడతేర్చాడో కిరాతకుడు. కుండేటి చంద్రశేఖర్ కుటుంబం కొన్నేండ్ల క్రితం ఏపీలోని విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్న చంద్రశేఖర్కు బీహెచ్ఈఎల్కు చెందిన హిమబిందుతో 2011లో వివాహమైంది. వీరికి మోక్షజ్ఞ (8) కూతురు ఉంది. దంపతులు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తూ చందానగర్లో ఉంటున్నారు. చంద్రశేఖర్కు తక్కువ వేతనం ఉండటంతో ఇద్దరి మధ్య గొడవలయ్యేవి. ఇటీవల చంద్రశేఖర్ ఉద్యోగం కోల్పోవటంతో ఇద్దరి మధ్య వివాదం పెద్దదై బీహెచ్ఈఎల్లోని తల్లి వద్దకు హిమబిందు కూతురుతో వెళ్లిపోయింది.
చంద్రశేఖర్ చందానగర్లో 8 నెలలుగా ఒంటరిగా ఉంటున్నాడు. ఆర్థిక సమస్యలు కూడా తోడై మానసికంగా కుంగిపోయాడు. భార్య సంతోషంగా ఉంటుండటంతో, ఆమెకు సంతోషం దక్కొద్దంటే కూతురును చంపేయాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్కూల్ వద్దకు వెళ్లి మోక్షజను తీసుకెళ్లి బీహెచ్ఈల్ టౌన్షిప్ వద్ద కారు ఆపి కూతురుకు తన కష్టాలన్నీ చెప్పాడు. తల్లితో మాట్లాడి నచ్చజెప్తానని కూతురు అంటుండగానే గొంతుకోశాడు. వద్దు డాడీ.. ప్లీజ్ డాడీ అంటున్నా కిరాతకంగా హతమార్చాడు. మృతదేహాన్ని పడేసేందుకు రాత్రి 10.30 గంటల సమయంలో ఔటర్ సమీపంలోని కోహెడ ఎక్స్రోడ్ వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ముందు టైర్ పగిలింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారును పరిశీలించగా మృతదేహం కనిపించింది. చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్యచేశానని ఒప్పుకొన్నాడు. అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏసీపీ భీమ్రెడ్డి శనివారం సాయంత్రం కేసు వివరాలను వెల్లడించారు. సమావేశంలో సీఐ మన్మోహన్, డీఐ వెంకట్రామ్రెడ్డి పాల్గొన్నారు.