హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలతో వ్యవసాయం పండగ అయింది. రైతుబంధు పథకంతో పెట్టుబడి బాధలు తప్పి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు సంతరించుకున్నాయి. రైతు కుటుంబాల్లో నూతన క్రాంతి చేరిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గత రెండేళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలు, వైరస్ లను భోగి మంటలలో అగ్ని దేవుడికి ఆహుతి చేసి, రాబోయే కాలంలో సుఖ, సంతోషాలను ప్రసాదించాలని భగవంతుణ్ణి ఈ పండగ సందర్భంగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
పల్లెలు నిజమైన ప్రగతి కేంద్రాలు కావాలని పల్లె ప్రగతి చేపట్టి, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలనే మాటను నిజం చేస్తూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నంతో నిజమైన సంక్రాంతి వచ్చిందన్నారు. రైతు బాగు పడడం ఇష్టం లేని కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి వారిని రోడ్డు మీదకి లాగిందన్నారు.
రైతు వ్యతిరేకతతో వాటిని వెనక్కి తీసుకుని నవ్వుల పాలు అయిందన్నారు. అయినా మళ్లీ ఎరువుల ధరలు పెంచి రైతుల జీవితాల్లో సంక్రాంతి లేకుండా చేస్తుందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరి కూడా భోగి మంటల్లో కాలి, సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ పథకాలు కేంద్రం కూడా అమలు చేసే మంచి ఆలోచన రావాలని ఆకాంక్షించారు.