నర్సంపేట : అన్నదాతకు అండగా నిలిచిన వరంగల్ సీపీ (Warangal CP)రంగనాథ్ చిత్రపటానికి బాధిత కుటుంబం క్షీరాభిషేకం చేసిన అరుదైన ఘట్టం వరంగల్ జిల్లా నర్సంపేట(Narsampeta)లో శుక్రవారం చోటు చేసుకుంది. నర్సంపేట 19 వ వార్డునకు చెందిన (Farmer) నాడెం వీరస్వామి అనే రైతు తనకున్న రెండు ఎకరాల భూమిలో ఇరవై గుంటల భూమిని 2018 మే నెలలో ఏనుగల్లు తండాకు చెందిన బ్యాంక్ ఉద్యోగి బానోత్ అనిల్ భార్య, అతడి సోదరుడు సునీల్కు విక్రయించాడు. హద్దులు కూడా ఏర్పాటు చేశారు. మిగతా భూమిలో వీరస్వామి వ్యవసాయం చేస్తున్నాడు.
కొద్ది కాలం నుంచి బానోత్ అనిల్, సునీల్ కలిసి వీరస్వామిని మరో పది గుంటల భూమిని తమకు అమ్మాలని ఒత్తిడి(Pressure) చేస్తూ మనోవేదనకు(Emotional Distress) గురి చేస్తున్నారు. తనకు భూమి అమ్మడం ఇష్టం లేదని చెప్పినా కాని వారు మరికొంతమందితో కలిసి పలుమార్లు వీరస్వామిని బెదిరించడంతో పాటు దాడికి యత్నించారు. వీరస్వామి నాటువేసిన పొలాన్ని కూడా ధ్వంసం చేశారు. హద్దు రాళ్లు తొలగించారు. అయిన తమ బెదిరింపులను ఖాతరు చేయడం లేదన్న కక్షతో తమను కులంపేరుతో దూషిస్తున్నారని ఫిబ్రవరి 27న అనిల్, సునీల్ నర్సంపేట పోలీసులకు ఫిర్యాదు(Police Complaint) చేశారు. దీంతో పోలీసులు బాధితుడు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
తనకు న్యాయం చేయాలంటూ వీరస్వామి సీపీ రంగనాథ్కు(Commissioner Of Police ) ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీపీ డీసీపీని సంఘటనా స్థలానికి పంపించి పూర్తి స్థాయిలో విచారణ(Enquiary) జరిపించారు. విచారణలో వీరస్వామిపై తప్పుడు కేసు నమోదు కావడంపై సీపీ సీరియస్ అయ్యారు. ఆ కేసును తీసివేయాలని పోలీసులకు సూచించారు. బానోత్ అనిల్, సునీల్ మరో 11 మందిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీసు కమిషనర్ రంగనాథ్ చొరవ వల్లే తమకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేస్తూ రైతు వీరస్వామి కుటుంబం నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద సీపీ చిత్రపటం ఏర్పాటు చేసి క్షీరాభిషేకం చేశారు. అక్కడున్న వారికి స్వీట్లు పంపిణీ చేసి సీపీ పనితీరును అభినందించారు.