వరంగల్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వారికి వ్యవసాయమే జీవనాధారం. మూడెకరాలు భూమి.. ఓ బావి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాజెక్టుల నుంచి పంటలకు క్రమం తప్పకుండా నీటిని విడుదల చేసేది. ప్రాజెక్టుల నీరు విడుదల చేసినప్పుడల్లా బావిలో పుష్కలంగా నీళ్లచ్చేవి. ఆ నీటి వసతితో మూడెకరాల్లో మూడు పువ్వులు.. ఆరు కాయలుగా పంటలు పండేంది. పదేండ్లుగా వచ్చిన పంట దిగుబడితో భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబానికి పొట్ట తిప్పలు ఉండకపోయేది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.
ఆ రైతుకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎప్పటిలాగే వస్తాయనుకున్న ప్రాజెక్టుల్లోని నీరు ఈ సారి రాలేదు. బావిలో కూడా నీళ్లు కూడా అడుగంటిపోయాయి. పంటలకు నీళ్లందక ఎండిపోతుంటే రైతు కండ్లల్లో నీళ్లు తిరిగాయి. దిగుబడి సంగతి దేవుడెరుగు పెట్టుబడి కూడా కరువవడంతో పంట చేనులోనే పురుగుల మందు తాగాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన రైతు కానరానిలోకానికి వెళ్లిపోయాడు. పుట్టెడు దుఖంలో ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు పొట్ట తిప్పల కోసం కూలీ పనికి వెళ్తున్నది.
హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన రైతు పిట్టల సుధాకర్ (43)కు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో గతంలో తవ్విన బావితో నీటి వసతి ఉన్నది. ఆ నీటితో వరి, మొక్కజొన్న పంటలు పండించేవాడు. కేసీఆర్ పాలనలో ప్రాజెక్టుల నుంచి వచ్చిన సాగునీటితో పదేండ్లుగా భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేవి. పంటల సాగుకు నీళ్ల ఇబ్బందులు లేకుండా ఉండేది. ఇదే ధీమాతో సుధాకర్ రెండేండ్ల క్రితం అప్పులు తెచ్చి కూతురు రవళి పెళ్లి చేశాడు. తెచ్చిన అప్పును ప్రతి పంటకు కొంత లెక్కన తీర్చవచ్చని అనుకున్నాడు. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచిందన్నట్టు ఈ యాసంగిలో ఎప్పటిలాగే ఎకరంలో వరి, రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. బావిలో మొదట్లో పంటలకు సరిపడా నీళ్లు ఉండేవి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టుల నుంచి సాగునీటి సరఫరా నిర్వహణ సరిగా చేయలేదు. దీంతో ఫిబ్రవరి మధ్య నుంచి బావిలో నీళ్లు పూర్తిగా అయిపోవడం మొదలైంది. ఆందోళన చెందిన సుధాకర్ మరింత మొత్తం అప్పుగా తెచ్చి వ్యవసాయ బావిలో రెండు సైడ్ బోర్లు వేయించాడు. ఆ రెండు సైడ్ బోర్లు ఫెయిల్ అయ్యాయి. కూతురు పెళ్లి కోసం తెచ్చినవి, బోర్ల కోసం తెచ్చిన అప్పులు కలిపి రూ.15 లక్షలు దాటింది. పేరుకుపోయిన అప్పులను తలుచుకుని సుధాకర్ పూర్తిగా కుంగిపోయాడు. కండ్ల ముందే ఎండుతున్న పంటలను చూసి ఆత్మైస్థెర్యం కోల్పోయాడు. పంట చేన్లలోనే మార్చి 18న పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు. దీంతో భార్య విజయ, 9వ తరగతి చదువుతున్న కుమారుడు రాహుల్ రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది.
పుట్టెడు దుఃఖంలో ఉన్న సుధాకర్ కుటుంబాన్ని మంత్రులు, నాయకులు ఎవరూ పట్టించుకోలేదు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినా పొట్ట తిప్పలు కోసం సుధాకర్ భార్య విజయ కూలి పనులకు వెళ్తున్నది. వ్యవసాయ భూమి ఉన్నా బావిలో నీళ్లు లేకపోవడంతో పంటలు వేసుకునే పరిస్థితి లేకుండాపోయింది. ప్రభుత్వపరంగా ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరా చేసే పరిస్థితి లేదు. గ్రామపంచాయతీలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ఇప్పటి వరకు సుధాకర్ డెత్ సర్టిఫికెట్ జారీ కాలేదు. ఈ సర్టిఫికెట్ ఎప్పటి వరకు జారీ అవుతుందో చెప్పలేని పరిస్థితి ఉన్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని డెత్ సర్టిఫికెట్తో పాటు రైతు బీమా దరఖాస్తు చేయిస్తే.. ఆ పైసలు తమకు కొంతవరకైనా ఆసరా అవుతాయని సుధాకర్ భార్య విజయ వాపోయింది. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నది.