Mahalakshmi Scheme | నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 18: ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆటో కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. పెరిగిన డీజిల్ ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న తమపై ప్రభుత్వ నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారిందని వాపోతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ అదే సమయంలో తమకూ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఆటోలకు ఉన్న కాస్త గిరాకీ పోయిందని, సర్కార్ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆటోవాలాలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ర్యాలీలు చేసి, రోడ్లపై బైఠాయించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. జగిత్యాల డీజిల్ ఆటో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ దాకా భారీ ర్యాలీ తీశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, గొల్లపల్లిలో ఆటో యూనియన్ సభ్యులు నిరసన తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డిలో ఆటో యూనియన్ ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సీఎస్ఐ గ్రౌండ్లో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్కు వినతిపత్రం అందజేశారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి.. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవోకు వినతి అందజేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. రూ.వేల ఫైనాన్స్లు తీసుకొచ్చి వాహనాలు కొనుగోలు చేసిన కార్మికులు వాటిని నడపలేక.. ఆటో ఫైనాన్స్ కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉపాధి చూపించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఆటోవాలాలు నిరసన వ్యక్తం చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా నేరేడుచర్ల, మునగాల, భువనగిరి, రామన్నపేటలో ఆటో కార్మికులు ధర్నా, రాస్తారోకో చేశారు. తమకు నెలకు రూ.15 వేల జీవన భృతిని ఇవ్వాలని కోరుతూ తాసీల్దార్లకు వినతి పత్రం అందజేశారు. జనగామ జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్తోపాటు కారు డ్రైవర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టిన అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ పర్మర్ పింకేశ్కుమార్ లలిత్కుమార్కు వినతి పత్రం అందజేశారు. మహబూబాబాద్ జిల్లాలోని వివిధ మండలాల ఆటోడ్రైవర్లు కలిసి పట్టణలోని అంబేద్కర్ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
రోజూ రూ.1000 ఆదాయానికి గండి
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయానికి రోజు రూ.1000 వరకు గండి పడిందని బీఎంఎస్ అనుబంధ తెలంగాణ స్టేట్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తంచేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, వారికి ఇబ్బంది కలుగకుండాచర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు సంఘం నాయకులు సోమవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర వాటివల్ల ఆటోలకు గిరాకీ తగ్గిపోయిందని, తాజాగా మహాలక్ష్మి పథకంతో ఉన్న కాస్త గిరాకీ కూడా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తన నిర్ణయంపై సమీక్ష నిర్వహించి, ఆటో డ్రైవర్లకు నష్టం జరుగకుండాచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.