సీఎం కేసీఆర్కు అటవీశాఖ ధన్యవాదాలు
హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగించేందుకు హరితనిధి ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో హరితహారంపై లఘుచర్చ అనంతరం మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విప్ గువ్వల బాలరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(హరితహారం) శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, సీఎంవోఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితరులు అసెంబ్లీలోని సీఎం చాంబర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. హరితనిధి ఏర్పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతను గుర్తుచేయడంతోపాటు, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతుందని చెప్పారు. అన్ని పార్టీల సభ్యులు ముక్తకంఠంతో స్వాగతించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. హరితనిధి ఏర్పాటు పట్ల అటవీసంరక్షణ ప్రధానాధికారి(పీసీసీఎఫ్) ఆర్శోభతో పాటు తెలంగాణ ఐఎఫ్ఎస్ అధికారుల సంఘం, ఐఎఫ్ఎస్ అసోసియేషన్, స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఇది బృహత్తర కార్యక్రమమని, రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం సాధిస్తామని పేర్కొన్నారు.