‘బండి సంజయ్.. నిరాశ, నిస్పృహలతో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఓ సైకోలా వ్యవహరిస్తున్నావు. నువ్వు గుట్కాలు తిని జైలుకెళ్తే.. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పెత్తందారులను ఎదిరించి మేం జైలుకు వెళ్లినం. నీ తాటాకుచప్పుళ్లకు బెదిరే వాళ్లు ఎవరూ లేరు. తెలంగాణ ఉద్యోగులను అవమానపరిస్తే మంచిగుండదు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘం నాయకులపై చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
– మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులను అవమానించేలా మాట్లాడిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఉద్యోగలోకం భగ్గుమన్నది. ఎంపీ స్థానంలో ఉండీ బూతులు మాట్లాడిన తీరును ముక్తకఠంతో తప్పుబట్టింది. సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో హోరెత్తించారు. సంజయ్ తీరును వ్యతిరేకిస్తూ.. ఉదయం నుంచే నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మధ్యాహ్న భోజన విరామంలో కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ‘బండి సంజయ్ డౌన్డౌన్.. బీజేపీ డౌన్డౌన్’ అంటూ నినాదాలు చేశారు. బండి సంజయ్ వెంటనే ఉద్యోగులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని
ఎదుట ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో జేఏసీ చైర్మన్ మామిండ్ల రాజేందర్, సెక్రటరీ జనరల్ వీ మమత, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు, టీజీవో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, రవీందర్రావు, గడ్డం జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
నమస్తే తెలంగాణ, న్యూస్ నెట్వర్క్: టీఎన్జీవో నాయకులపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టరేట్ల వద్ద భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్లబాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. మెదక్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు దొంతు నరేందర్, సంగారెడ్డి జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు సుశీల్బాబు, సిద్దిపేట జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, కార్యదర్శి కోమండ్ల విక్రమ్రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొన్నా రు. కాగా, మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీఎన్జీవో కార్యాలయం ఎదుట టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు పాకాల శ్రీహరి ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పోచయ్య, రాజశేఖర్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు. కాగజ్నగర్లోని ఈఎస్ఐ దవాఖాన ఎదుట, ఆదిలాబాద్లో కలెక్టరేట్, సహకార కార్యాలయం ఎదుట, నిర్మల్ కలెక్టరేట్లో ఉద్యోగులు నిరసన చేపట్టి, బండిసంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. అన్ని శాఖల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. నిజామాబాద్ కలెక్టర్ వద్ద జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, కామారెడ్డి కలెక్టరేట్ వద్ద టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
హనుమకొండ కలెక్టరేట్ ఎదుట టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు లక్ష్మయ్య, కార్యదర్శి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన సమయంలో బండికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా నాయకులు విజయ్కుమార్, చంద్రశేఖర్, రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తారకేశ్వర్ పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిరసనల్లో అంజద్పాషా, రవీందర్, విజయలక్ష్మి, శ్రీకాంత్రెడ్డి, శ్రీలత, యాదగిరి, రవీందర్, రమేశ్, నర్సింహులు, హేమలత, బంధవి, శివకుమారి పాల్గొన్నారు.
ఉద్యోగుల ఆత్మైస్థెర్యం దెబ్బతినేలా బండి సంజయ్ మాట్లాడారు. గతంలోనూ ఇలానే మాట్లాడినా ఆయన విచక్షణకే వదిలేశాం. ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడితే ఇకపై ఊరుకోబోం. ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగ సంఘాలతో ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ సర్కారు ఉద్యోగులను ఆదుకొంటున్నది. ఉద్యమ కాలంలో వలస పాలకులు ఉద్యోగుల మెడపై కత్తిపెట్టినప్పుడు ఈ బీజేపీ నేతలు ఏమయ్యారు? ఉద్యోగుల శక్తి బీజేపీకి తెలియంది కాదు. ఉద్యోగులతో పెట్టుకున్నవాళ్లకు ఏం జరిగిందో తెలియంది కాదు. ఇన్కం ట్యాక్స్ పేరుతో ఒక్కో ఉద్యోగి నుంచి 2 నుంచి 3 నెలల జీతాన్ని లాక్కుంటున్నరు. ఉద్యోగులను ప్రభుత్వానికి దూరం చేసే ఇలాంటి కుట్రలను తిప్పికొడతాం. బండి సంజయ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. లేదంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం.
– మామిండ్ల రాజేందర్, ఉద్యోగ జేఏసీ చైర్మన్
జీతాలు కాదు జీవితాలు ముఖ్యమని ఉద్యమ సమయంలో పోరాడినం. అలాంటి ఉద్యోగ సంఘాలను అమ్ముడు పోయేవాళ్లు అంటూ మాట్లాడిన బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా. ఉద్యమకాలంలో కేసీఆర్తో కలిసి పనిచేశాం. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నాం. అడిగిన దానికంటే ఎక్కువగా పీఆర్సీ ఇచ్చారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉండేందుకే జీవో -317 తెచ్చారు. ప్రభుత్వానికి అవార్డులు వస్తున్నాయంటే ఉద్యోగుల కృషే కారణం. ఉద్యోగులపై నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు.
– వీ మమత, ఉద్యోగ జేఏసీ సెక్రటరీ జనరల్
తెలంగాణ కోసం మేం దిక్కులు పిక్కటిల్లేలా కొట్లాడిన్నాడు బండి సంజయ్ ఎక్కడున్నాడు. ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనని, కనిపించని ఆయ న తెలంగాణ ఆకాంక్షలకు ప్రతిరూపమైన ఉద్యోగులను విమర్శించడం దా రుణం. మేం ప్రభుత్వ ఉద్యోగులం, ప్ర భుత్వంతో కలిసి నడుస్తాం. దీంట్లో తప్పేమున్నది? తప్పు తెలుసుకొని బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలి. ఇలా ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకో బోం. ఉద్యోగుల తడాఖా చూపిస్తాం.
-గడ్డం జ్ఞానేశ్వర్
అమ్ముడుపోయారని, సిగ్గుందా అంటూ ఉద్యోగులను అవమానించిన బండి సంజయ్.. ఉద్యోగులందరికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా కనిపించని ఆయన ఉద్యమకారుల గురించి మాట్లాడటం విడ్డూరం. రాష్ట్ర సాధనలో అగ్రభాగంలో ఉండి పనిచేసిన ఉద్యోగుల పట్ల ఇలా మాట్లాడటమంటే ఉద్యమకారులను అవమానించినట్టే.
– ఎం చెన్నయ్య, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు